గుండాల, ఏప్రిల్ 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి బువ్వ పెట్టే స్థాయికి ఎదిగిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని గడప లేదని, సబ్బండ వర్గాలకూ సర్కారు సాయం అందుతున్నదని పేర్కొన్నారు. మండలంలోని సుద్దాల గ్రామంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ దూర దృష్టితో ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతున్నదని అన్నారు.
సీఎం కేసీఆర్ రైతుల బాగు కోసం అనునిత్యం ఆలోచించే గొప్ప నాయకుడని, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంటు, మిషన్ కాకతీయ వంటివి అమలు చేసి రైతులను రాజు చేశారని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, దళితబంధు, ఆరోగ్య మహిళ వంటి బృహత్తరమైన పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రజల కోసం అహర్నిషలు కష్టపడి పనిచేస్తుంటే.. దేశంలో మోదీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నదని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో చేసిన అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కనిపించకపోతే కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీయే ప్రజలకు అండగా ఉంటున్నదని, దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఇతర రాష్ర్టాల్లోని రైతులు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంటు కావాలని అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారన్నారు.
తెలంగాణ సరిహద్దు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర రైతులు తమ గ్రామాలను తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. గుండాల మండలంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సుద్దాలలో బిక్కేరు వాగుపై రూ.14.50 కోట్లతో బ్రిడ్జి నిర్మించామని, ఆలేరు నుంచి గుండాల మీదుగా మోత్కూరు వరకు రూ.44 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం చేశామని తెలిపారు. అతి త్వరలో గృహలక్ష్మి పథకం ద్వారా నిరుపేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షల సాయం అందించనున్నట్లు తెలిపారు. దళితబంధు పథకం ద్వారా దళితులకు పది లక్షల సాయం అందించనున్నట్లు, త్వరలో రైతుల రుణమాఫీ కూడా చేయనున్నట్లు తెలిపారు.