రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబాల ప్రజలు సరైన ఆహారం తీసుకోని కారణంగా పలు వ్యాధుల బారిన పడుతుంటారు. అలాంటి వారికి పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ కర్నెల్ రైస్ను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా చర్యలు చేపడుతున్నది. ప్రతినెలా ఇచ్చే రేషన్ బియ్యంలో పోషకాలు కలిపి ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుంచి పంపిణీ చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 7,89, 618 కార్డుల ద్వారా 25,54,828 మందికి 23, 021 టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ను అందజేయనున్నది. ఈ ఫోర్టిఫైడ్ బియ్యంలో క్వింటా బియ్యంలో ఒక కేజీ కర్నెల్స్ కలిపి పంపిణీ చేయనున్నారు. ఫోర్టిఫైడ్ రైస్లో ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్-12 ఉండనున్నాయి. వీటిని మిల్లింగ్ చేసే సమయంలోనే కలిపి ఎఫ్సీఐకి పెట్టనుండగా అక్కడ నుంచి ఆయా ప్రాంతాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.
నల్లగొండ , జనవరి 8 : పేదలకు పోషకాలు కలిగిన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఏజెన్సీ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేస్తుండగా.. మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంపిణీ చేసేందుకు సివిల్ సైప్లె యంత్రాంగం సిద్ధం చేస్తున్నది. ఇందుకోసం పంజాబ్, గుజరాత్ నుంచి కర్నెల్స్ను కొనుగోలు చేస్తున్నారు. మిల్లుల వద్ద ధాన్యం మిల్లింగ్ చేసిన తరువాత నాణ్యమైన బియ్యాన్ని వేరుచేసి ఫోర్టిఫైడ్ కర్నెల్స్ను బ్లెండింగ్ మిషన్స్ ద్వారా కలిపి డెలివరీ చేయనున్నారు. మిల్లింగ్ చేస్తున్న సమయంలోనే కర్నెల్స్ను మిక్సింగ్ చేయడం వల్ల బియ్యం మొత్తంలో పోషకాలు సమాన స్థాయిలో ఉండనున్నాయి.
కర్నెల్స్లో పలు రకాల పోషకాలు
ఫోర్టిఫైడ్ కర్నెల్స్ రైస్లో పలు రకాల పోషకాలు ఉంటాయి. మనిషి ఎదుగుదలతోపాటు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని పెంపొందించడం, రక్తహీనత మెరుగు పరచడం, వ్యాధి నిరోధక శక్తి పెరుగడానికి దోహదపడుతాయి. ఈ బియ్యంలో ఐరన్తోపాటు ఫోలిక్ యాసిడ్, ఐరన్, మిటమిన్-బీ పోషకాలు ఉంటాయి. ఒక కిలో ఫోర్టిఫైడ్ బియ్యంలో 3,525 మైక్రో గ్రాముల ఐరన్, పది వేల మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్, వంద మైక్రోగ్రాముల బి-12 పోషకాలు ఉంటాయి. దీంతో చిన్నపిల్లలతోపాటు వృద్ధుల్లో కండరాలు గట్టిపడుతాయి. ఎముకలు పటిష్టంగా ఉండటంతోపాటు కాల్షియం సమస్య నివారించబడుతుంది. ఇందుకోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 250 మిల్లులకు ఇప్పటికే ఫోర్టిఫైడ్ కర్నెల్ రైస్ బ్లెండింగ్ మిషన్లు అమర్చారు. వీటిల్లో క్వింటా బియ్యానికి కిలో చొప్పున ఫోర్టిఫైడ్ కర్నెల్స్ కలుపనున్నారు.
25.54 లక్షల మందికి లబ్ధి
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రభుత్వం ప్రతినెలా 25.54 లక్షల మందికి 23,021 టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నది. నల్లగొండ జిల్లాలో 4,66,057 రేషన్ కార్డుల ద్వారా 16,20,375 యూనిట్లకు 13,258 టన్నుల బియ్యం అందిస్తున్నారు. 902 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ బియ్యం పంపిణీ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 610 రేషన్ షాపులు, 3,23,561 కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 9,34,453 యూనిట్లకు 9,763 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు.
త్వరలో ఫోర్టిఫైడ్ కర్నెల్ రైస్ పంపిణీ
ప్రభుత్వం పేదలకు పోషకాలు కలిగిన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఫోర్టిఫైడ్ కర్నెల్స్ కలిపిన రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు ఏజెన్సీ జిల్లాల్లో కర్నెల్స్ కలిపిన రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. త్వరలోనే నల్లగొండ జిల్లాలో అందజేయనున్నాం. ధాన్యం మిల్లింగ్ చేసేటప్పుడే కర్నెల్స్ కలుపడం వల్ల రేషన్ బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరికీ పోషక విలువలతో కూడిన భోజనం తినే అవకాశం లభిస్తుంది. నల్లగొండ జిల్లాలో 16లక్షల మందికి 7.63 లక్షల టన్నుల బియ్యాన్ని అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి, నల్లగొండ