ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 243 మందికి అవకాశం
హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
రామగిరి, జూన్ 22 : ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, జీఓ 317తో బదిలీ అయిన ఉపాధ్యాయులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేం దుకు మ్యూచువల్ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వారి ఇబ్బందులును గుర్తించిన ప్రభుత్వం దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ అధికారులు అర్హులైన ఉపాధ్యాయుల జాబితాను సైతం జిల్లాల వారీగా విడుదల చేశారు. త్వరలోనే వీరంతా తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
243 మంది టీచర్లకు అవకాశం
పరస్పర బదిలీల కోసం సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన 243 మంది ఉపాధ్యాయులకు ఊరట లభించింది. వారంతా తమ సొంత ప్రాంతాల నుంచి దూరంగా రావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ పరస్పర బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేశారు. దాంతో పరస్పర బదిలీ కోరిన ప్రాంతాలకు టీచర్లు వెళ్తున్నారు.
విద్యాశాఖ ఉత్తర్వులు అమలు చేస్తున్నాం
పరస్పర బదిలీల విషయంలో ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులను అమలు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన 110 మంది ఉపాధ్యాయులు మ్యూచువల్స్లో ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్లేవారి స్థానంలో వేరే వారు వచ్చి చేరుతారు. కొంత మంది ఉపాధ్యాయులు వారి స్థానాల నుంచి ఇప్పటికే రిలీవ్ అయ్యారు.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు
పరస్పర బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను నల్లగొండ జిల్లాలోని ఎంపీపీఎస్ పులిచర్ల నుంచి సూర్యాపేట జిల్లాలోని అక్కలదేవి గ్రామానికి మ్యూచువల్ కోరడంతో అవకాశం వచ్చింది. బుధవారం నేను కోరిన పాఠశాలలో చేరాను. ఇంత కాలం కుటుంబానికి దూరంగా ఉండి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ప్రశాంతంగా పని చేస్తాను.
– సత్యనారాయణ గుడిపూడి, ఎస్జీటీ