నీలగిరి, జూన్ 02 : షీర్డి వెళ్లివస్తూ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని హుస్నాబాద్ జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్ సమీపంలో నివాసం ఉంటున్న సురేశ్ (48) నాలుగు రోజుల కితం స్నేహితులతో కలిసి షీర్డి సాయిబాబా దర్శనం కోసం వెళ్లాడు. దర్శనం పూర్తిచేసుకుని తిరిగి వస్తుండగా అదివారం ఉదయం హుస్నాబాద్ సమీపంలోకి రాగానే కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
డ్రైవర్తో పాటు స్నేహితులు కారు నుండి బయటకు వచ్చారు. కానీ సురేశ్ బయటకు వచ్చేలోపే మంటలు విపరీతంగా రావడంతో అందులోనే చిక్కుకుని దహనమయ్యాడు. సురేశ్ మాడ్గులపల్లి మండలంలోని చెర్వుపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆయన భార్య జ్యోతి మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. సురేశ్కు కుమారుడు, కుమారై ఉన్నారు. వీరిద్దరు కూడా డాక్టర్లే. ఇటివలే కూతురు వివాహం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.