యాదాద్రి భువనగిరి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) ;ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సర్కారు బడులు స్వరాష్ట్రంలో అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రూపురేఖలు మార్చుకున్నాయి. సకల హంగులతో విరాజిల్లుతున్నాయి. విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యంతోపాటు విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు కూడా సత్ఫలితాలనిస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం, ఉదయం అల్పాహారం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రీడింగ్ కార్నర్లు, డిజిటల్ క్లాసులు తదితర కార్యక్రమాలతో విద్యారంగం అలరారుతున్నది. దీంతో తల్లిదండ్రులపై ఆర్థికభారం తగ్గింది.
జిల్లాలో మొత్తం 921 పాఠశాలల్లో 1,09,387 మంది విద్యార్థులు ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 744 ప్రభుత్వ పాఠశాలలు, 158 ప్రైవేటు పాఠశాలలు, సంక్షేమశాఖల ఆధ్వర్యంలో నిర్వహించే 19 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. విద్యాప్రమాణాల పెంపు, గుణాత్మకమైన మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించేలా రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తుండగా, వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఒక్కో విద్యార్థి ప్రగతిని టీచర్లు పరీక్షించి, వారి స్థాయిలను బట్టి ప్రత్యేకంగా బోధించి, నిర్దిష్ట కనీస సామర్థ్యాలను సాధించేలా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
మన ఊరు – మన బడి..
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మన ఊరు-మన బడి ప్రణాళిక గొప్పగా అమలవుతున్నది. కార్పొరేట్ స్థాయిలో స్కూళ్లన్నీ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. గ్రామాల్లో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సకల సదుపాయాలను కల్పిస్తున్నారు. అదనపు తరగతి గదులు, రిపేర్లు, టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్, డైనింగ్హాల్, కిచెన్ హెడ్, ప్రహరీగోడ లాంటి పనులు చేపడుతున్నారు. పక్కా భవనాలు రంగులతో భవనాలు కళకళలాడుతున్నాయి. మొదటి విడుతలో భాగంగా జిల్లాలో 251 స్కూళ్లను బాగు చేయాలని ఎంపిక చేశారు. వీటిలో 83 హైస్కూళ్లు, 148 ప్రాథమిక, 20 మాధ్యమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
విద్యార్థులందరికీ అల్పాహారం..
విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలను తీసుకొచ్చిన ప్రభుత్వం ఇటీవల సీఎం అల్పాహారం పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాంబార్ లేదా గోధుమ రవ్వ, చట్నీ, పూరీ, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, ఉప్మా, సాంబార్ లేదా కిచిడీ, మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్లో ప్రతి రోజు ఏదో ఒక మెనూను అల్పాహారంగా పెడుతున్నారు. దశలవారీగా జిల్లా అంతటా అమలు కానుంది. జిల్లాలో 46,346 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
ఇంగ్లిష్ మీడియం బోధన..
గ్రామీణ, పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను కూడా సర్కారు అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ స్కూళ్ల వైపు విద్యార్థుల దృష్టి మళ్లించేలా చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచడమే లక్ష్యంగా విద్యాబోధనలో సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ జిల్లా పరిషత్, సంక్షేమ గురుకులాలు, మోడల్ స్కూళ్లలో డిజిటల్ విద్యాబోధన అమలు చేస్తున్నది. 82 స్కూళ్లలో కొత్తగా డిజిటల్ క్లాసులను నడుస్తున్నాయి.
బాలికల కోసం కేజీబీవీలు..
బాలికా విద్యను వృద్ధిపరచడంపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణ పాఠశాలల్లో బాలిక విద్యను ప్రోత్సహించడంతో పాటు బాలికల కోసం ప్రత్యేక గురుకులాలు, కేజీబీవీలను రెసిడెన్షియల్ పాఠశాలల తరహాలో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 11 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 2263 మంది బాలికలు చదువుకుంటున్నారు. చదువుతో పాటు సాఫ్ట్ సిల్స్, ఉపాధి కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆర్థికంగా తగ్గిన భారం..
ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుండడంతో సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల తాకిడి పెరుగుతున్నది. తల్లిదండ్రులు సైతం ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. దీంతో పేదలపై ఆర్థిక భారం తగ్గుతున్నది. ప్రైవేట్లో ఏడాదికి కనీసం 70వేల నుంచి లక్ష ఖర్చు చేయాల్సి పరిస్థితి ఉంది. ఇప్పుడు సర్కారే అన్ని భరిస్తుండడంతో పేరెంట్స్ సంతోషంగా ఉంటునన్నారు.
ఉచితంగా పాఠ్యపుస్తకాలు.. యూనిఫామ్లు.
ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు కూడా అందించాలనే ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 3,47,450ఉచిత పాఠ్యపుస్తకాలను అందించారు. 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టు వారీగా నోట్ పుస్తకాలను అందిస్తున్నారు. వీరికి 3,08,558 నోట్బుక్స్ ఇచ్చారు. ఇక ఉచితంగా ప్రభుత్వం యూనిఫామ్లున పంపిణీ చేసింది. జిల్లాలోని 55,847మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫామ్లను అందించారు.
సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం
పేద కుటుంబాల పిల్లలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం తీసుకొచ్చింది. మధ్యాహ్న భోజనంలో కిచిడీ, గుడ్డు, సాంబార్, ఆకుకూరలు, పప్పు, వెజ్ బిర్యానీ తదిత వంటకాలను రోజువారీగా అందిస్తున్నారు. జిల్లాలోని 712 ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 55,012 మంది పిల్లలు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
డిజిటల్, వైజ్ఞానిక వనరులు..
నైపుణ్యాలను సాధించేలా, పిల్లల భాగస్వామ్యాన్ని పెంచేలా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ యుగంలో, జీవన నైపుణ్యాలతో తన జీవనాన్ని కొనసాగించేలా విద్యార్థులను విద్యాశాఖ తీర్చిద్దుతున్నది. ఇందుకనుగుణంగా డిజిటల్ వనరులను సమకూరుస్తున్నది. ఇందులో భాగంగా 488 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ట్యాబ్లను పంపిణీ చేసింది. 17 మండల రిసోర్సు కేంద్రాలు, 157 ఉన్నత పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నారు.
పాఠశాలల్లో గ్రంథాలయాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పఠనం అలవాటు చేయడానికి వీలుగా గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం మొదటి దశలో 152 ప్రాథమిక పాఠశాలల్లో, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గ్రంథాలయకు పుస్తకాలను పంపిణీ చేశారు. దశల వారీగా అన్ని పాఠశాలలకు పంపిణీ చేయడానికి ప్రణాళిక తయారు చేశారు.