యాదగిరిగుట్ట, మార్చి 10 : మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. దేశంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని, రాష్ట్రంలోని ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఒక కీలకమైన అంశాన్ని తమరి దృష్టికి తీసుకురావాలని లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీలో చేపట్టిన దీక్షకు మద్దుతుగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక రాష్ర్టాలకు చెందిన వివిధ పార్టీలు, మహిళా సంఘాలతోపాటు మేధావులు మద్దతు ప్రకటించారని తెలిపారు. చట్టసభల్లో రిజర్వేషన్ల అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఉన్నదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్లు కల్పించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. మహిళా సాధికారత పట్ల రాష్ట్ర ప్రభుత్వం తమ నిబద్ధతను వంద శాతం రుజువు చేసుకున్నదని లేఖలో పేర్కొన్నారు. చట్టం ప్రకారం స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్ 50 నుంచి 60 శాతం వరకు తప్పనిసరి చేసినట్లు వెల్లడించారు. దీంతోపాటు మార్కెట్ కమిటీల నియామకాల్లోనూ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళా సాధికారత పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తన పరిధిలో ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వెంటనే పరిష్కరించాలని కోరారు.
చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్ల అంశం అనేక ఏండ్లు కోల్డ్ స్టోరేజీలో నానుతూనే ఉన్నదని తెలిపారు. ఎన్నికల సమయంలో జాతీయ పార్టీలు మహిళా రిజర్వేషన్లకు హామీలివ్వడం, ఆ తరువాత హామీని తుంగలో తొక్కడం పరిపాటిగా మారిందని విమర్శించారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ కీలకమైన సమస్యను పరిష్కరించేందుకు ఒక్కటంటే ఒక్క అడుగు సైతం ముందుకు వేయలేదన్నారు. కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడం పెద్ద కష్టమేమీ కాదని పేర్కొన్నారు. అయినప్పటికీ ఎనిమిదిన్నరేండ్లుగా ఈ అంశాన్ని కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వెంటనే పరిష్కరించాలని, లేకుంటే దేశ వ్యాప్తంగా మహిళల సంఘటిత శక్తి ఏంటో కేంద్ర ప్రభుత్వానికి తెలిసివచ్చేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల విషయంలో సాను కూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి లేఖలో పేర్కొన్నారు.