యాదాద్రి, జూలై 20 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సువర్ణ పుష్పార్చన బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆర్జిత పూజల్లో భాగంగా ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా రూ.600 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం చేశారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చించారు. నిత్యపూజలు ఉదయమే ప్రారంభమయ్యాయి. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ఉత్తర దిశలో మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం చేశారు. స్వామివారి కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. సాయంత్రం వేళలో స్వామివారి వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి 7గంటలకు స్వామివారి తిరువరాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. కొండపైన ఉన్న పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన చేశారు. కొండ కింద లక్ష్మీపుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన చేశారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి ఖజానాకు రూ.9,16,640 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
నేడు హుండీ లెక్కింపు..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ హుండీలను నేడు లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. గురువారం ఉదయం 9.00 గంటలకు కొండపైన గల హరిత హోటల్లో లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు.
యాదాద్రీశుడికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ పూజలు
యాదాద్రీశుడిని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ జీ.చంద్రశేఖర్రెడ్డి దర్శించుకున్నారు. బుధవారం యాదాద్రి చేరుకున్న ఆయన మొదటగా స్వయంభువులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.