రామగిరి, నవంబర్ 8 : విద్యా వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొని లక్ష్యం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన 3వ కాన్వకేషన్(స్నాతకోత్సవం)కు ఛాన్స్లర్ హోదాలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆమెకు ఆర్ట్స్ బ్లాక్ వద్ద వీసీ ప్రొ.గోపాల్రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు పుష్పగుచ్ఛాలు అందచేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఆర్ట్స్ బ్లాక్లోని మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంజీయూ పాలకమండలి, వీసీ, రిజిస్ట్రార్తో గ్రూప్ఫొటో దిగి నేరుగా కాన్వకేషన్ వేదిక వద్దకు చేరుకున్నారు. 2018-19 నుంచి 2020-21 బ్యాచ్ల వరకు ఎంజీయూ, ఉమ్మడి జిల్లాలోని అనుబంధ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో వర్సిటీ టాపర్స్గా నిలిచిన 40 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 2019 నుంచి అక్టోబర్ 2023 వరకు ఎంజీయూ పీహెచ్డీ(డాక్టరేట్) పొందిన పరిశోధన విద్యార్థులకు ముఖ్య వక్త, ఓయూ మాజీ వీసీ ప్రొ.రామచంద్రం, ఎంజీయూ వీసీ ప్రొ.చొల్లెటి గోపాల్రెడ్డితో కలిసి పట్టాలు అందచేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జ్ఞానాన్ని ఉద్ఘాటించారు. నిజమైన విద్యలో జ్ఞాన సముపార్జన మాత్రమే కాకుండా.. వ్యక్తి గుణాన్ని పెంపొందించేలా, ఆధ్యాత్మికత వృద్ధి చెందేలా ఉండాలన్నారు. జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా విద్యపై దృష్టి సారించాలని సూచించారు.
స్నేహభావం, సమానత్వం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా దేశంలో ఇతర వర్సిటీలకు దీటుగా ఎంజీయూ రాణించాలని ఆకాంక్షించారు. వీసీ గోపాల్రెడ్డి సేవలు వర్సిటీ అభివృద్ధిలో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. విద్యార్థుల ప్రగతిలో తల్లిదండ్రుల ప్రోత్సాహం గొప్పదని పేర్కొన్నారు. విద్యా ప్రయాణంలో విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగితే లక్ష్యం చేరుకోవడం సులభమని సూచించారు. విద్యార్థులు తమ జీవిత ఆశయాలను సాధించాలని, అప్పుడే తల్లిదండ్రుల కలలను నిజం చేసినవారు అవుతారని తెలిపారు. బంగారు పతకాలు, పీహెచ్డీ పట్టాలు పొందిన వారంతా భవిష్యత్లో ఇలాంటి వేదికలపై ప్రసంగించే స్థాయికి ఎదుగాలని ఆకాంక్షించారు. ముఖ్య వక్త, ఓయూ మాజీ వీసీ ప్రొ.రామచంద్రం మాట్లాడుతూ తాను చదువు కోసం పడిన కష్టాలను, విద్య పరివర్తన శక్తిని వివరించారు.
కాలానుగుణంగా విద్యలో వచ్చే సాంకేతిక అంశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఎంజీయూ వీసీ ప్రొ.చొల్లెటి గోపాల్రెడ్డి మాట్లాడుతూ 2007లో ఎంజీయూ ఆవిర్భావం నుంచి నేటి వరకు అభివృద్ధి చేసిన అంశాలను వివరించారు. నిరంతరం యూనివర్సిటీ అభివృద్ధి, విద్యార్థుల శ్రేయస్సు కోసమే పని చేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో యూనివర్సిటీని మరింత అభివృద్ధిలోకి తీసుకొస్తామన్నారు. నేటి అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంజీయూ ఇన్చార్జి రిజిస్ట్రార్, వీసీ టూ ఓఎస్డీ ప్రొ. అల్వాల రవి, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మిర్యాల రమేశ్కుమార్, అసిస్టెంట్ సీఓఈ డాక్టర్ హరీశ్కుమార్, పరీక్షల విభాగం కో ఆర్డినేటర్స్ డాక్టర్ భిక్షమయ్య, చిల్కూరి రమేశ్, పాలకమండలి సభ్యులు బోయపల్లి కృష్ణారెడ్డి, ఆకుల రవి, అంజిరెడ్డి, శ్రీదేవి, డాక్టర్ ఘన్శ్యాం, ప్రొ.యాదగిరి, సోమరమేశ్, కోటేశ్వర్రావు, గోలి అమరేందర్రెడ్డి, హెచ్ఓడీలు దోమల రమేశ్, ప్రేమ్సాగర్, ఉపేందర్రెడ్డి, ప్రశాంతి, కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బంది పాల్గొన్నారు.
ఎంజీ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో 2018-20బ్యాచ్లో ఎంఏ ఇంగ్లిష్ కోర్సు పూర్తి చేశాను. ఆ బ్యాచ్లో యూనివర్సిటీ స్థాయిలో టాపర్గా నిలువడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇదే విషయాన్ని మా కళాశాల యాజమాన్యం తెలియజేయడంతో వచ్చి కాన్వకేషన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, వీసీ గోపాల్రెడ్డి చేతుల మీదుగా పట్టా పొందడం సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదివితే జీవితంలో ఎన్నో మైలురాళ్లు చేరుకోవచ్చు.
-జిన్నె దీప్తి, గోల్డ్ మెడలిస్ట్(ఎంఏ ఇంగ్లిష్)
నేను 2019లో ఎంజీయూ సైన్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాను. నన్ను చదువులో అమ్మానాన్న ఎంతో ప్రోత్సహించారు. వారి స్ఫూర్తితోనే చదివి ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో యూనివర్సిటీ టాపర్గా నిలిచాను. స్నాతకోత్సవంలో బంగారు పతకంతోపాటు కాన్వకేషన్ తీసుకోవడంతో అమ్మానాన్న కండ్లల్లో ఆనందం చూశాను. నేను ప్రస్తుతం ఐఐసీటీ హైదరాబాద్లో పీహెచ్డీ కొనసాగిస్తున్నా. ప్రతి ఒక్కరూ లక్ష్య సాధనతోపాటు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా చదువాలి. పీహెచ్డీ పూర్తి చేసి ఉన్నతోద్యోగం చేయాలన్నదే నా లక్ష్యం.
– సాయిప్రియ, గోల్డ్ మెడలిస్ట్(ఎమ్మెస్సీ కెమిస్ట్రీ)