సూర్యాపేట, జూలై 14 (నమస్తే తెలంగాణ) : మూడు దశాబ్దాల క్రితం అరకొరగా టీవీలు ఉండగా సెల్ఫోన్లు అసలే లేవు. గ్రామాల్లో సాయంత్రం అయ్యిందంటే చాలు.. పాఠశాల నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన రైతులు, పనులు ముగించుకున్న గృహిణులు ఇండ్ల ముందు చేరి కబుర్లు చెప్పుకోవడం. ఆటలు ఆడడం జరిగేది. గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కబుర్లు చెప్పుకొనేవారు. అలాంటి గ్రామీణ వాతావరణం నేడు పూర్తిగా మారిపోయింది. సెల్ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్ల్లో వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర యాప్లతో యూత్.. టీవీ సీరియళ్లలో మహిళలు మునిగిపోతూ మానవ సంబంధాలను కోల్పోతున్నారు. ఇక వ్యాయామం అనేది చాలా తక్కువ. అందుకే చిన్న వయస్సులోనే అనేక శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. అయితే.. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట నియోజకవర్గంలో నేడు పాత రోజులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. సెల్ఫోన్లో అర్ధరాత్రి వరకు చాటింగ్లు, గేమ్స్ నుంచి యువతను కాస్త దూరం చేసి మాయమవుతున్న మానవ సంబంధాలు దగ్గర చేయడం.. క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం.. శరీరానికి వ్యాయామం దక్కాలనే ఉద్దేశంతో మంత్రి తన పుట్టిన రోజును పురస్కరించుకొని మూడేండ్లుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది నిర్వహిస్తున్న క్రీడలకు యమ క్రేజ్ లభిస్తున్నది.
పోటీలు పూర్తయినా కొనసాగుతున్న క్రీడలు
క్రీడా పోటీలు పూర్తయినా గ్రామాల్లో క్రీడలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రి జగదీశ్రెడ్డి అన్ని రకాల క్రీడలకు సంబంధించిన క్రీడా సామగ్రి కిట్లు ఉచితంగా అందించి క్రీడా పోటీలు నిర్వహించడంతో జనానికి ఆటలు అలవాటుగా మారాయి. క్రీడా పోటీలు పూర్తయినా రోజూ సాయంత్రం వేళ గ్రామాల్లో క్రీడలు ఆడుతూ రాత్రి 10గంటల్లోపే పడుకుంటున్నామని, సెల్ఫోన్తో అర్ధరాత్రి వరకు గడపడం తగ్గిపోయిందని యువత చెబుతున్నారు. టీవీ సీరియళ్లపై ఆసక్తి తగ్గుతుందని మహిళలు పేర్కొంటున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి మూడేండ్ల క్రితం ఏ లక్ష్యంతో క్రీడా పోటీలు ప్రారంభించారో నేడు అది కొంతమేర సాకారమవుతుందనడానికి గ్రామాల్లో నిత్యం ఆటలు కొనసాగుతుండడమే ఉదాహరణ.
ప్రతి ఒక్కరికీ గిఫ్ట్లు
క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ గిఫ్ట్ ఇస్తున్నారు. ప్రతి క్రీడలో గ్రామ స్థాయిలో విజేతలకు బహుమతులతోపాటు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.10వేలు, రూ.6వేలు, 4వేల రూపాయల ప్రైజ్మనీ అందిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో రూ.50వేలు, రూ.30వేలు, 20వేల రూపాయల చొప్పున అందజేయనున్నారు. వీటితో పాటు క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మంచి బహుమతి కూడా ఇస్తున్నారు.
గ్రామీణ క్రీడలతో కళకళలాడుతున్న పల్లెలు
జగదీశన్న క్రీడా పోటీలతో నెల రోజులుగా పల్లెలు కళకళలాడుతున్నాయి. గత నెల 16న ప్రారంభమైన క్రీడలు నాలుగు మండలాల పరిధిలోని 113 గ్రామ పంచాయతీల్లో, సూర్యాపేట మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో జరుగుతున్నాయి. తొలుత యువతకు మాత్రమే క్రీడా పోటీలు నిర్వహించగా.. చిన్నారులు, కాస్త వయస్సు పైనబడిన వారు సైతం ముందుకు రావడంతో వారిని కూడా టీమ్లుగా చేసి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, టెన్నికాయిట్, షార్ట్పుట్, షటిల్, రన్నింగ్, టగ్ ఆఫ్ వార్, కోలాటం, ముగ్గులు తదితర ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంతోపాటు మున్సిపల్ వార్డుల్లో 3 టీమ్ల చొప్పున మొత్తం 490కి పైనే జట్లను ఎంపిక చేయగా దాదాపు 50వేల మంది క్రీడా పోటీల్లో పాల్గొంటుండడం గమనార్హం. 113 పురుషుల జట్లకుగానూ అన్ని క్రీడలు కలిపి ఒక్కో టీమ్లో 80 మంది వరకు ఉండడంతో మొత్తం 9,040 మంది క్రీడల్లో పాల్గొన్నారు. అలాగే స్త్రీలు 60 మంది చొప్పున 113 పంచాయతీల్లో 6,080 మంది, కోలాటాల్లో 90 మంది చొప్పున 10,170 మంది, అథ్లెటిక్స్లో 50 మంది చొప్పున 5,650 మందితోపాటు 70 మంది చొప్పున అన్ని పంచాయతీల్లో 7,910మంది పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని 48వార్డుల్లో 450 మంది చొప్పున 21,600 మంది.. మొత్తంగా దాదాపు 60వేల మంది క్రీడల్లో పాల్గొంటున్నారు.
పోటీ పడి ముందుకు వస్తున్నారు
మంత్రి జగదీశ్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని మూడేండ్లుగా క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా.. ఈ సారి ఉచితంగా క్రీడా కిట్లు అందించారు. దీంతో యువత మాత్రమే కాకుండా మధ్య వయస్సు వారు, వృద్ధులు కూడా క్రీడల్లో పాల్గొనేందుకు పోటీ పడి ముందుకు వస్తున్నారు. పోటీలు పూర్తయినా క్రీడలు ఆడుతుండడం గ్రామాల్లో కనిపిస్తున్నది. చిన్నారులను సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నుంచి దూరం చేస్తూ క్రీడల వైపు మళ్లించేందుకు ఈ క్రీడలు ఎంతో దోహదపడుతున్నాయి. నేను 22 సంవత్సరాలుగా పీఈటీగా పనిచేస్తుండగా.. గ్రామీణ స్థాయి క్రీడా పోటీలు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి.
– మల్లేశం, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు
చిన్నప్పటి ఆటలు గుర్తుకొస్తున్నాయి
జగదీశన్న క్రీడా పోటీలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పల్లెల్లోని క్రీడాకారులు, మహిళలు, యువతీ, యువకులు ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. జగదీశన్న కప్ క్రీడా పోటీల్లో ఖోఖో, కబడ్డీ, కుర్చీలాట, తాడు గుంజుడు ఆడిపించడంతో ప్రతి మహిళా ఉత్సహంగా పాల్గొంటున్నారు. వాటిని చూస్తుంటే ప్రతి ఒక్కరికీ చిన్నప్పటి ఆటలు గుర్తుకొస్తున్నాయి. గ్రామాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇలాంటి ఆటల పోటీలు నిర్వహిస్తున్న మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు.
– ఈదుల భవాని, సోలిపేట, (సూర్యాపేట రూరల్)
బడిలో ఆడిన ఆటలు యాదికి వస్తున్నాయి
నేను గ్రామంలో చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో కబడ్డీ బాగా ఆడేది. నాకు క్యాచర్గా మంచి పేరుండె. ఎవరు కూతకు వచ్చినా వదలకపోయేదాన్ని. ఇప్పుడు నాకు సుమారు 50సంవత్సరాలు. పెండ్లి అయిన నాటి నుంచి ఎక్కడా కబడ్డీ ఆడలేదు. గ్రామంలో కూడా మా వయస్సు ఉన్నవారికి పోటీలు పెట్టిన దాఖలాలు లేకుండె. ఇప్పుడు మంత్రి జగదీశ్రెడ్డి అన్ని గ్రామాల్లో ఆటల పోటీలు పెట్టి ప్రోత్సహించడం సంతోషంగా ఉన్నది. క్రీడలపై ఆసక్తి ఉన్న మాలాంటి వాళ్లకు అవకాశం కల్పించిండ్రు. వయస్సుతో సంబంధం లేకుండా ఆటల పోటీల్లో పాల్గొనవచ్చని అనగానే నా పేరు ముందుగానే రాయించా. జీజేఆర్ కప్ క్రీడల్లో గ్రామంలో మూడు మ్యాచ్లలో పాల్గొని గెలిచాం. మండల స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ సాధించాం. చదువుకున్న రోజుల్లో ఆడిన ఆటలను ఇప్పుడు మంత్రి జగదీశ్రెడ్డి తట్టి లేపినట్టుగా ఉన్నది.
– కాకునూరి విజయకుమారి, తంగెళ్లగూడెం, పెన్పహాడ్ మండలం
రోజూ సాధన చేస్తున్నాం
మంత్రి జగదీశ్రెడ్డి కప్ క్రీడలు మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల ద్వారా రోజూ 15మందిమి సాయంత్రం పూట గ్రౌండ్లో సాధన చేస్తున్నాం. ఆటలు ఆడడం ద్వారా అలిసిపోతున్నాం. దాంతో మంచిగా నిద్ర వస్తున్నది. అందరం ఒక దగ్గర చేరి ఆటలాడడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తున్నది. గతంలో ఎక్కువ సమయం సెల్ఫోన్తో గడిపేవాళ్లం. ఆటల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. మంత్రి జగదీశ్రెడ్డి ఆటల పోటీలు నిర్వహించడంతో ఆటల మీద ఆసక్తి పెరిగింది. స్పోర్ట్స్ సామగ్రి అందించడంతో ఆటలపై మక్కువ ఏర్పడింది.
– బోళ్ల మాధవరెడ్డి, ఆత్మకూర్.ఎస్