సర్కారు చొరవతో గట్టుప్పల్కు వారం ముందే దసరా సంబురం వచ్చింది. గట్టుప్పల్ను కొత్త మండలంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికంగా సంతోషం ఉప్పొంగింది. మంగళవారం ఊరు ఊరంతా ఒక్కటై జమ్మికి వెళ్లినట్లుగా డప్పుచప్పుళ్ల మధ్య జులూస్ తీసింది. పార్టీలకతీతంగా పెద్దఎత్తున ముందుకువచ్చి పటాకులు కాల్చారు. స్వీట్లు పంచుకుని నోరు తీపి చేసుకున్నారు. తమ ఏండ్ల నాటి కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటామని గ్రామస్తులంతా ముక్త కంఠంతో ప్రకటించారు.
చండూరు(గట్టుప్పల) 27 : గట్టుప్పలను మండలంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి గెజిట్ విడుదల చేయడంతో మండల వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. మంగళవారం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చౌరస్తాలో పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మండల ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు, అందుకు కృషి చేసిన మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీలో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అంద ని కుటుంబం రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదన్నారు. గట్టుప్పల మండల ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్కు మండల ప్రజలంతా అండగా ఉండాలని, రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, సర్పంచ్ ఇడెం రోజ, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండారు చంద్రయ్య, ఎంపీటీసీలు అవ్వారు గీతాశ్రీనివాస్, గొరిగె సత్తయ్య, నాయకులు నామని గోపాల్, భీమగాని మహేశ్గౌడ్, చెరుపల్లి ఆంజనేయులు, ఇడెం గణేశ్, కర్నాటి అబ్బయ్య, పురుషోత్తం, రాఘవేంద్ర, కృష్ణ పాల్గొన్నారు.
వివాదాలకు తావు లేకుండా
గట్టుప్పల మండల కేంద్రానికి చుట్టు పక్కల ఉన్న నల్లగొండ డివిజన్ పరిధిలోని గ్రామాలను మాత్రమే విలీనం చేశారు. చండూరు మండలం కొండాపురాన్ని తొలుత విలీనం చేసినట్లు ప్రకటించినప్పటికీ తర్వాత ప్రజా ఆకాంక్ష మేరకు దానిని చండూరులోనే ఉంచారు. గట్టుప్పలతోపాటు తెరటుపల్లి, కమ్మగూడం, శేరిగూడెం, మునుగోడు మండలంలోని వెల్మకన్నె, మర్రిగూడ మండలంలోని అంతంపేట, నామాపురం, సోమరాజుగూడేన్ని కలిపి గట్టుప్పల మండలంగా ఏర్పాటు చేశారు.
ఉద్యమ ఆకాంక్ష నెరవేరింది
2016 నుంచి గట్టుప్పల గ్రామస్తులు జేఏసీగా ఏర్పడి ప్రత్యేక మండలం కోసం ఉద్యమం ప్రారంభించారు. 798 రోజులు పాటు నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ మండలాన్ని ప్రకటించారు. దాంతో దసరాకు ముందే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఎంతో ఆనందంగా ఉంది
ఎన్నో ఏండ్ల ప్రజల కల సాకారమైనందుకు ఆనందంగా ఉంది. ప్రభుత్వానికి, మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. మండల అభివృద్ధిలో కూడా ప్రభుత్వ తోడ్పాటు బాగా ఉంటుందని నమ్మకం ఉంది. గట్టుప్పల ప్రజలు, నాయకులు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.
– ఇడెం కైలాసం, గట్టుప్పల మండల సాధన సమితి కన్వీనర్
ఇది ప్రజా ప్రభుత్వం
టీఆర్ఎస్ సర్కారు ప్రజల ఆకాంక్షను గుర్తించే ప్రభుత్వం. ఎవరికి ఏం కావాలనేది సీఎం కేసీఆర్కు బాగా తెలుసు. మండల ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజల అభిప్రాయాన్ని గుర్తించి మాట ఇచ్చాను. అది ఇప్పుడు నెరవేరింది. గట్టుప్పలను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శమండలంగా తీర్చిదిద్దుకోవటానికి ప్రజలు ప్రభుత్వం వెంట నడువాలి.
– కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మునుగోడు
టీఆర్ఎస్లో చేరినగట్టుప్పల ఎంపీటీసీ
చండూరు(గట్టుప్పల), సెప్టెంబర్ 27 : గట్టుప్పల ఎంపీటీసీ అవ్వారు గీతా శ్రీనివాస్ వారం రోజుల క్రితం బీజేపీలో చేరగా మంగళవారం సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ సమక్షంలో తిరిగి టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి పొరపాటు చేశానని, మండలం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్తోనే ఉంటూ టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేస్తాన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇడెం రోజ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.