Police | పెద్దవూర, ఫిబ్రవరి 16: ఓ కారు తన కండ్ల ముందే 150 కిలోమీటర్ల వేగంతో రహదారిపై దూసుకెళ్లింది. అనుమానంతో ఎస్సై దానిని వెంబడించారు. పోలీస్ వాహనం వెంబడిస్తున్నదని కారు వేగాన్ని స్మగ్లర్ మరింత పెంచాడు. ఎస్సైకి అనుమానం మరింత బలపడింది. సుమారు 20 కిలోమీటర్లు చేజ్ చేశారు. పోలీసులను అప్రమత్తం చేశారు. యాక్షన్ సినిమా చేజింగ్ను తలపించిన ఈ ఘటన నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై గురువారం చోటుచేసుకున్నది. నల్లగొండ జిల్లా పెద్దవూర ఎస్సై నాగార్జునసాగర్ సర్కిల్ కార్యాలయానికి గురువారం ఉదయం వెళ్లి కారులో తిరిగి వస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ మాచర్ల నుంచి సాగర్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న కారును చూశారు.
సుమారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో కారు వెళ్లడంతో అనుమానం వచ్చిన ఎస్ఐతోపాటు సాగర్ పోలీస్ సిబ్బంది పెద్దవూర వరకు 20 కిలోమీటర్ల మేర కారును వెంబడించారు. వై జంక్షన్ వద్దకు వచ్చిన పోలీస్ సిబ్బందిని చూసిన స్మగ్లర్ కారును మిర్యాలగూడ రోడ్డుకు మళ్లించాడు. ఎదురుగా వాహనాలు వస్తుండటంతో స్మగ్లర్ వెంటనే తన కారును హైదరాబాద్ వైపు రాంగ్ రూట్లో మలుపడంతో ట్రాఫిక్లో ఇరుక్కుంది. స్మగ్లర్ కారు డోర్ తీసి పక్కనే ఉన్న విద్యుత్తు సబ్స్టేషన్ గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు 300 మీటర్లు వెంబడించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. గోడ దూకడంతో స్మగ్లర్ కాలు విరిగింది. చికిత్స నిమిత్తం పోలీసులు స్మగ్లర్ను సాగర్ కమలానెహ్రూ దవాఖానకు తరలించారు. కారులో రూ.60 లక్షల విలువైన 100 కిలోల గంజాయి ఉన్నట్టు సమాచారం.