బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు సంబురంగా జరిగాయి. వాడవాడల నుంచి గణేశుడి విగ్రహాలను ప్రత్యేకంగా వాహనాల్లో అలంకరించి శోభాయాత్రగా తరలించారు. డప్పు చప్పుళ్లమధ్య యువకులు, చిన్నారులు తీన్మార్ స్టెప్పులు వేసుకుంటూ ముందుకు సాగారు. గణపతి బప్పామోరియా నినాదాలు మార్మోగాయి. దారి పొడువునా సాగిన శోభాయాత్రతో గ్రామాలు, పట్టణాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. భక్తులు అర్ధరాత్రి వరకు చెరువులు, కాల్వల్లో నిమజ్జనం చేసి గణనాథుడికి వీడ్కోలు పలికారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గణేశుడి శోభాయాత్రను మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడిపి భక్తులను ఉత్సాహ పరిచారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గణనాథుడి లడ్డూలు, దండలు, కండువాల వేలం పాటలు పోటాపోటీగా జరిగాయి. నల్లగొండ జిల్లా కేంద్రం హనుమాన్ నగర్లో లడ్డూ రూ.36 లక్షలు పలికింది.
సంబురంగా గణనాథుడి నిమజ్జనోత్సవం
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం గణేశ్ నిమజ్జన వేడుకలు అంబరాన్నంటాయి.
తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జనం శోభాయమానంగా జరిగింది. గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేశ్ మహారాజ్కీ జై.. అన్న నినాదాలు మిన్నంటాయి. సన్నాయిమేళం, బ్యాండ్ చప్పుళ్ల హోరు.. అతివల కోలాటాలు.. యువత, మహిళలు, చిన్నారుల నృత్యాల నడుమ ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై విఘ్నేశ్వరుడు వీధివీధినా ఊరేగుతూ గంగమ్మ ఒడికి చేరాడు.
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు గణేశ్ విగ్రహాలకు పూజలు చేసి శోభాయాత్రలను ప్రారంభించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట
బందోబస్తు నిర్వహించారు.