నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. చేనేత కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన భరోసాను అందిస్తున్నది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు భువనగిరి, నారాయణపురంలో బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్లర్లను మంజూరు చేసింది. తాజాగా వాటికి మొదటి విడుత ఇన్స్టాల్మెంట్ నిధులు కూడా విడుదలయ్యాయి. ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించగా, త్వరలోనే చేనేత పనిముట్లు, యంత్రాలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
– యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జిల్లాలోని భువనగిరి, సంస్థాన్ నారాయణపురంలో బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఉప ఎన్నిక ముగిసిన కొన్ని రోజుల్లోనే క్లస్టర్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. అయితే.. క్లస్టర్ అందుబాటులోకి వస్తే నేత కార్మికులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. చేనేత సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి నిధులు కూడా వస్తాయి. సబ్సిడీపై మగ్గం, ఇతర పనిముట్లు అందనున్నాయి. స్థలం ఉంటే లూమ్ కోసం వర్క్షెడ్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాగా జిల్లాలో ఇప్పటికే మూడు మండలాల్లో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంలో క్లస్టర్లు ఉండగా.. విజయవంతంగా అమలు చేస్తున్నారు. మొదటి విడుతలో భాగంగా నిధులు విడుదల కావడంతో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
నిధులు, పనిముట్లు ఇలా..
బ్లాక్లెవల్ చేనేత క్లసర్లకు సంబంధించి తాజాగా నిధులు విడుదలయ్యాయి. భువనగిరి క్లస్టర్కు రూ.1.64కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.1.56కోట్లు ప్రభుత్వ గ్రాంట్, లబ్ధిదారుడి వాటా రూ.7.6లక్షలు. మొదటి ఇన్స్టాల్మెంట్లో భాగంగా ఇటీవల రూ.61.73లక్షలు విడుదల కాగా, ఈ నిధులతో ఫ్రేమ్లూమ్స్ 57, ఆసు యంత్రాలు 7, పిర్న్డబ్బా మిషన్లు 19, వ్యక్తిగత వర్క్ షెడ్లు 18.. ఇతర ఉపకరణాలు అందించనున్నారు. సంస్థాన్ నారాయణపురం క్లస్టర్కు రూ.73లక్షలు మంజూరు కాగా, ఇందులో ప్రభుత్వ గ్రాంట్ రూ.70.10లక్షలు, లబ్ధిదారుడి వాటా రూ.2.90లక్షలుగా నిర్ణయించారు. మొదటి ఇన్స్టాల్మెంట్ కింద రూ.35.06లక్షలు విడుదలయ్యాయి. వీటితో 38 ఫ్రేమ్లూమ్స్, 3 ఆసు యంత్రాలు, 22 పిర్న్ డబ్బా యంత్రాలను అందించనున్నారు. అయితే ఇప్పటికే జిల్లాలో 250మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో మొదటి విడుతలో ఎవరెవరికి ఇవ్వాలో తేల్చే పనిలో అధికారులు ఉన్నారు.
గ్రూపులుగా ఏర్పడి..
చేనేత క్లస్టర్లలో భాగంగా వృత్తిపై ఆధారపడిన కార్మికుల అభివృద్ధి లక్ష్యంగా వారిని ఇందులో చేర్చుతారు. గ్రూపులుగా ఏర్పాటు చేస్తారు. వచ్చిన నిధులకు అనుగుణంగా అధునాతన యంత్రాలు, డిజైన్లు, రంగుల అద్దకం ఎలా ఉపయోగించాలో నేర్పిస్తారు. ఇందుకు ట్రైనర్లను నియమిస్తారు. అలాగే వారి మగ్గాలను అవసరమైన మోటార్ జాకార్డులు, మగ్గాలు, లిఫ్టింగ్ యంత్రాలను 90శాతం ప్రభుత్వ రాయితీతో సరఫరా చేస్తారు. చేనేత వృత్తిని నమ్ముకుని అభివృద్ధి సాధించిన ప్రాంతాల క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తారు. తయారు చేసిన చీరెలకు మార్కెట్ సదుపాయం కల్పిస్తారు.