నార్కట్పల్లి, మే 2 : నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల నెరవేరబోతున్నది. నల్లగొండ జిల్లాలో ప్రథమంగా నకిరేకల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్న ముఖ్యమంత్రి సహకారానికి నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి తాను ఉన్నానంటూ ముందుకొచ్చారు. తమ తల్లిదండ్రులు బండ పిచ్చమ్మ, చంద్రారెడ్డిల జ్ఞాపకార్థం వారి స్వగ్రామం నక్కలపల్లి గ్రామంలో సుమారు రూ.1.50 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించేందుకు ప్రభుత్వానికి ఇచ్చి ఔదార్యం చాటుకున్నారు. ఈ భూమిలో 72 ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటి వరకు 64 ఇండ్లను నిర్మించి సిద్ధం చేశారు. ఇంకా ఎనిమిది ఇండ్ల పనులు జరుగుతున్నాయి.
పూర్తి చేసిన ఇండ్ల పట్టాల పంపిణీకి అధికారులు పక్షపాత ధోరణి లేకుండా డ్రా పద్ధతిన అర్హులైన నిరుపేదలను ఎంపిక చేశారు. వారికి జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా బుధవారం పట్టాలు అందజేయనున్నారు. కాగా, అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
నిరుపేదలకు ఇండ్లు కట్టించాలనే సంకల్పం నెరవేరింది
నేను మారుమూల గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించాను. నాకు చిన్నప్పటి నుంచే గూడు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పం ఉండేది. అది ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో నేడు నెరవేరుతుంది. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలిచాను. నాటి నుంచి నేటి వరకు గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారు. నేను పార్టీ బలోపేతానికి చేసిన కృషికి, పేదలకు జరిగిన న్యాయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ తనను జడ్పీ చైర్మన్గా చేయడం మా గ్రామస్తులకు వరం లాంటిది. సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కృషితో నార్కట్పల్లి మండలాన్ని జిల్లాలోనే ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతున్నా. మా గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, మండలంలో కోట్ల రూపాయలతో రహదారులు, విద్యుద్దీపాలు, డ్రైనేజీలు, కల్వర్టులను పూర్తి చేశాను. గత పాలకులు గుర్తించకపోయినా నేడు మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశాను.
–బండ, నరేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్, నల్లగొండ
చాలా సంతోషంగా ఉంది
నక్కలపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యి లబ్ధిదారులకు అందించడం సంతోషంగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జడ్పీ చైర్మన్ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్కు మా గ్రామ ప్రజలమంతా రుణపడి ఉంటాం. మా గ్రామం పక్షాన మంత్రి జగదీశ్రెడ్డి జడ్పీ చైర్మన్ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు.
–ఈద మాధవీనర్సింహ, సర్పంచ్, నక్కలపల్లి