నీలగిరి, జూన్ 23 : నల్లగొండ జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఒకే కుటుంబంలో జరిగిన నాలుగు హత్యలు పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నలుగురి హత్యలకు సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మంగళవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించడంతో రాత్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. తండ్రి సుల్తాన్కు ఆరు కత్తిపోట్లు, కుమారుడు ముజామ్మిల్కు 12, హసీనాకు 8, కూతురు అప్సర్ శరీరంపై తొమ్మిది కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పదునైన కత్తులతో ప్రతి ఒక్కరిని ఛాతిపై భాగం నుంచి మెడ, తలనే టార్గెట్ చేసి, హంతకులు దాడి చేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
కానీ హత్యలకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మూడు రోజుల క్రితం హత్యలు జరగడమే కాకుండా, సంఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చిక్కుముడిగా మారిన ఈ నాలుగు హత్యలకు సంబంధించిన నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసుల యంత్రాంగం అంతా సోమవారం రాత్రి నుంచి లోతైన విచారణ చేపడుతోంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏడు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మహ్మద్ సుల్తాన్కు రెండు, హసీనాకు మూడు వివాహాలు కావడంతో ఈకోణంలో వీరికి ఉన్న ఆస్తులపై ఉన్న పంచాయతీల వివరాలు సేకరిస్తున్నారు.
వీటినే కాకుండా కుమరుడు ముజామ్మిల్, కుతూరు అప్సర్ కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ నాలుగు హత్యలకు సంబంధించిన విషయాలపై ఐజీ షెహనాజ్ ఖాసీం ప్రత్యే దృష్టి సారించి నేరుగా జిల్లా ఎస్పీ, ఏఎస్పీలతోపాటు ప్రత్యేక బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు విషయాలను చర్చించినట్లు సమాచారం. కాగా ఈ కేసు విషయమై పోలీసులు ఇప్పటివరకు సుమారు 10 నుంచి 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరోపక్క క్లూస్ టీమ్, వేలిముద్రలు, సీసీ టీవీలు, సెల్ఫోన్ సీడీఆర్లను సేకరించి విచారణ చేపడుతున్నారు. అయినప్పటికీ నాలుగు హత్యలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఎవరు ఎందుకు హత్య చేశారో తెలియక పోలీసులు సతమతమవుతున్నట్లు సమాచారం. ప్రతి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులను బుధవారం సాయంత్రంలోగా కేసును ఛేదించాలని ఐజీ ఆదేశించినట్లు సమాచారం.