పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, సర్కారు దవాఖానలను బలోపేతం చేసి, డాక్టర్లు, వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపాలిటీ పరిధి లక్కారంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైద్యం కోసం రూ.1300 కోట్ల విలువైన పనులు చేసుకుంటున్నామన్నారు. యాదాద్రి జిల్లాకు త్వరలో మెడికల్ కాలేజీ రాబోతున్నదని ప్రకటించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు మంజూరు చేశామన్నారు. రెండు జిల్లాల్లో కీమోథెరపీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
సూర్యాపేటలో టీ డయాగ్నోస్టిక్ సేవలను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. 24 గంటల కరంట్, సాగునీరు, రైతు బంధు వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని, ఉమ్మడి నల్లగొండ వరి ఉత్పత్తిలో రికార్డు సాధించిందని తెలిపారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ఎందుకు ప్రవేశపెట్టలేదని, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ నాడు అధికారంలో ఉన్నా మెడికల్ కాలేజీలు, బత్తాయి, నిమ్మ మార్కెట్లు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. ఇతర పార్టీలు కోట్లు కుమ్మరించినా మునుగోడు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని, కృతజ్ఞతగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు.
– చౌటుప్పల్/చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్18
మాది చేతల ప్రభుత్వం
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. పల్లెల్లో జీవన స్థితిగతులు మెరుగు పడ్డాయి. రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయం పండుగలా మారింది. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే. పల్లె నుంచి పట్టణం వరకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుబాటులోకి వచ్చింది. రవాణా వ్యవస్థ మెరుగుపడింది. బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. సీఎం కేసీఆర్తోనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఇతర రాష్ర్టాల ప్రజలు నమ్ముతున్నారు. నేడు బీఆర్ఎస్ పార్టీకి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ వస్తున్నది. ఇది చూసి ఓర్వలేని బీజేపీ తెలంగాణపై కక్షగట్టి దాడులు, కుట్రలకు పాల్పడుతున్నది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ గల్లంతు కావడం ఖాయం.
చౌటుప్పల్, ఏప్రిల్ 18 : తెలంగాణ రాష్ట్రం రాకముందు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో 3లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిస్తే.. ఈ ఏడాది 45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు, రైతుబంధు, 24గంటల కరెంటుతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వ్యవసాయానికి కరెంటు 7గంటలే ఇస్తున్నారని తెలిపారు. వడ్లు కొనమని కేంద్రం అంటే.. సీఎం కేసీఆర్ ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. 2014-15లో రూ.3,392కోట్ల ధాన్యం సేకరిస్తే.. 2020-21నాటికి 26,600కోట్లకు చేరిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చౌటుప్పల్లో చెప్పులు క్యూలో పెట్టేవారని ఎద్దేవా చేశారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇవన్నీ సీఎం కేసీఆర్ అనే అద్భుత దీపం వల్లే సాధ్యమైందన్నారు. ఈ జిల్లాలో పెద్ద పెద్ద నాయకులున్నా మెడికల్ కాలేజీలు, బత్తాయి, నిమ్మకాయ మార్కెట్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, చౌటుప్పల్లో వంద పడకల దవాఖాన వచ్చాయని, మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. తెలంగాణ వస్తే ఏం వచ్చిందనే వారికి మీ కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని వివరించాలని సూచించారు. తెలంగాణ రాకముందు చౌటుప్పల్లో ఎకరా భూమి రూ.5లక్షలు ఉంటే.. నేడు రూ.2కోట్లు అయ్యిందన్నారు. యాదగిరిగుట్ట ఆలయం అభివృద్ధి సాధించిందని చెప్పారు. గతంలో కండ్లకు ఇబ్బంది కలిగితే దవాఖానకు వెళ్లేదని, ఇప్పుడు కంటి వెలుగుతో ఇంటి దగ్గరికే వచ్చి పరీక్షలు చేస్తున్నారని అన్నారు.
మన పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 18 : మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు లేవని ప్రజలు అక్కడి నాయకులను నిలదీస్తున్నారని, దీంతో హస్తిన పీటం కదులుతున్నదన్న బెంగ బీజేపీ నాయకులకు పట్టుకున్నదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో 35శాతం మంది ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్నారని, అక్కడ వ్యవసాయానికి రోజుకు 6గంటల విద్యుత్, రూ.600 పింఛన్లు ఇస్తూ గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తుండటంతో అక్కడి ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన కావాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రం కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్తోనే దేశంలో సంక్షేమ పథకాలు సాధ్యమవుతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
స్వరాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ దేశంలోనే అన్నపూర్ణ జిల్లాగా మారిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేతల సర్కారు అని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన కొద్దిరోజుల్లోనే నల్లగొండ జిల్లా దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా శాశ్వత పరిష్కారం చూపించారని తెలిపారు. నల్లగొండ జిల్లా ప్రజలు ఇంతవరకూ ఏ పార్టీకి దక్కని గౌరవాన్ని బీఆర్ఎస్కు 12 శాసనసభా స్థానాలు గెలిపించి ఇచ్చారన్నారు. అందుకే నల్లగొండ జిల్లాపై ముఖ్యమంత్రికి ప్రత్యేక అభిమానం ఉన్నదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, సంక్షేమ పథకాల ద్వారా జిల్లా ప్రజలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఇదే పట్టణంలో గతంలో సంక్షేమ పథకాలపై తాను వివరిస్తున్నప్పుడు మైక్ లాక్కున్న వ్యక్తికి నేడు మైక్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప్పెనలో ప్రతిపక్షాలు గల్లంతు కావడం ఖాయమన్నారు.
బీఆర్ఎస్కు తొలి విజయం మునుగోడు
టీఆర్ఎస్ పార్టీకి తొలి విజయం సిద్దిపేట అయితే.. బీఆర్ఎస్కు మునుగోడు నియోజకవర్గం అని మంత్రి హరీశ్రావు అన్నారు. కోట్లు కుమ్మరించినా ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోసం బీఆర్ఎస్కు పట్టం కట్టారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు కార్యకర్తలు సిద్ధమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వచ్చినప్పుడు ఓ సర్పంచ్ గ్రామాల్లో అత్తాకోడండ్ల పంచాయితీలు తగ్గాయని చెప్పినట్లు గుర్తు చేశారు. ఒక్కొక్కరికి 10కిలోల రేషన్ బియ్యం, ఆసరా పింఛన్లు రావడం వల్ల అత్తలను మంచిగా చూసుకుంటున్నారని తెలిపారు.
మహిళలు బీఆర్ఎస్ వైపే..
‘మహిళలు ఎందుకు మీ ప్రభుత్వానికి ఓటు వేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగారు. దానికి సమాధానంగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం తెచ్చారు.. ఈ పథకం కింద 10.26లక్షల మంది లబ్ధి పొందారు. ఇప్పటి వరకు 13లక్షల మందికి సీఎం కేసీఆర్ కిట్లు ఇచ్చాం. నీళ్లు మోసే భారం లేకుండా నల్లాలు పెట్టాం. వడ్డీలేని రుణాలు, ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. బాలింతలకు కొత్తగా న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాం. అందుకే మహిళలు బీఆర్ఎస్ వెంట ఉన్నారు’ అని మంత్రి హరీశ్రావు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవిశ్రీప్రసాద్, ఎంపీపీలు పల్లె కళ్యాణి, గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతి, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, టీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు గిర్కటి నిరంజన్గౌడ్, ముత్యాల ప్రభాకర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఓట్లు హక్కు
రాబోయో ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఓట్లు అడిగే దమ్ము బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ 65 లక్షల సభ్యత్వం, మునుగోడు నియోజకవర్గంలో 25వేల సభ్యత్వం కలిగి ఉన్నదని తెలిపారు. కార్యకర్తలందరూ కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిపక్షాల అంచనాలను తలకిందులు చేసి ప్రజలు మరోసారి బీఆర్ఎస్కు అధికారం అందించనున్నారని తెలిపారు. ప్రతిపక్షాల జిమ్మిక్కులను, అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్
చౌటుప్పల్ రూరల్ : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్మోడల్గా ఉన్నదని, ఇక్కడి సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాయని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అసూయ పడేలా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని పేర్కొన్నారు. గత పాలకులు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించలేదని, ప్రజా సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. రాబోయో ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు అందరం ఐకమత్యంగా ఉండి పనిచేయాలని సూచించారు.
నియోజకవర్గ ప్రజలే నా బలం
మునుగోడు నియోజకవర్గ ప్రజలే నా బలం, బలగమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నానని చెప్పారు. ఇప్పటికే వివిధ గ్రామాల్లో లింక్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టామని, ఇండోర్, అవుట్డోర్ స్టేడియాల పనులు ప్రారంభించామని తెలిపారు. తనను అన్ని రకాలుగా ఆదుకున్న మంత్రి హరీశ్రావు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. మనమందరం కుటుంబంలా ఉండి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.