సూర్యాపేట/ తిరుమలగిరి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ‘సమైక్య రాష్ట్రంలో అధికారం చెలాయించేందుకు పార్టీలు మారాయి తప్ప.. ప్రజల బతుకులు మార్చేందుకు కనీస ప్రయత్నాలు చేయలేదు. గతంలో ఇక్కడ రాజకీయ కక్షలు రాజ్యమేలితే రక్తపాతాలు పారాయి.. నేడు కాళేశ్వరం నీళ్లు పారుతున్నాయి. నాడు బుక్కెడు బువ్వ కోసం కూలి పని చేసుకుందామన్నా పని దొరుకని పరిస్థితి. నేడు ఇక్కడ కూలీలు దొరక్క ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, ఏపీ తదితర రాష్ర్టాల నుంచి వచ్చి కూలి పని చేస్తున్నారు. ఇది ఏనాడైనా ఊహించామా?’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో రూ.55 కోట్లతో నిర్మించే వంద పడకల దవాఖాన, రోడ్డు, బ్రిడ్జితోపాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులకు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే కిశోర్కుమార్ నేతృత్వంలో ఏర్పాటు ఏసిన ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక ప్రతి ఎకరాకు సాగునీరు అందుతున్నదని, నేడు తుంగతుర్తిలో లక్షా 50వేల ఎకరాలకు పైనే నీళ్లు పారుతున్నాయని అన్నారు. ఇక మీదట కాలం అయ్యిందా.. లేదా అని చూడాల్సిన అవసరం లేదని, నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పని లేదని తెలిపారు.
కాంగ్రెస్ నెత్తురు పారిస్తే.. కిశోర్ కాళేశ్వరం జలాలు పారిస్తుండు
తుంగతుర్తి, సెప్టెంబర్ 29 : అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తుంగతుర్తి ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు నెత్తురు పారిస్తే.. 9ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే కిశోర్కుమార్ కాళేశ్వరం జలాలు పారిస్తున్నాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కాళేశ్వరం నీళ్లు 200 కిలోమీటర్లు పారి తుంగతుర్తి ప్రాంతానికి వచ్చాయంటే సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రాజెక్టును మంత్రి హరీశ్రావు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి పూర్తి చేయించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు కమీషన్ల కోసమే కాల్వలు తవ్వి చుక్క నీరు ఇవ్వలేదని ఆరోపించారు. గతంలో నీళ్లివ్వమని అడిగితే కేసులు పెట్టి బెదిరించేవారని, నేడు నీళ్లు ఎక్కువగా ఇస్తున్నారు.. కొన్ని రోజులు ఆపండనే రోజులు వచ్చాయని చెప్పారు. సాగునీరు, 24గంటల కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఒకప్పుడు బీడు భూములతో దుమ్ములేసే సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాలు నేడు పచ్చని పొలాలతో సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. మనకు ఇంత చేస్తున్న ప్రభుత్వానికి మన ప్రాంతం నుంచి పూర్తి మద్దతు తెలేపాలని సూచించారు.
సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతోనే తుంగతుర్తి అభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానంతోనే తుంగతుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో 93వేల మందికి రైతుబంధు, 12వేల మందికి కల్యాణలక్ష్మి, 8వేల కేసీఆర్ కిట్లు, పైలెట్ ప్రాజెక్టు కింద తిరుమలగిరి మండలంలో 1100 మందికి దళిత బంధు అందింది. నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకం కింద 2200 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశాం. కాంగ్రెస్ హయాంలో తుంగతుర్తిలో కక్షలతో ఖతమైన కాంగ్రెస్ కార్యకర్తల సమాధులు దర్శనమిచ్చేవి. పనిలేక కక్షలతో రగిలిపోయే ఈ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లిచ్చి చేతినిండా పని కల్పించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. కాళేశ్వరం నీళ్లతో ఉమ్మడి జిల్లాలోనే తుంగతుర్తి ప్రాంతం నుంచి ఎక్కువ వరి పంట పండింది.
ఎదురొడ్డి పోరాడిన కిశోర్.. అభివృద్ధిలో పోటీ పడుతున్నడు
నాడు మీసాలు కూడా మొలువని యువకుడు గాదరి కిశోర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువులకు ఎదురొడ్డి పోరాడిన విషయాన్ని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. నాటి ఉద్యమంలో తమతో భుజం కలిపి పని చేసిండని, అందుకే కిశోర్ అంటే సీఎం కేసీఆర్కు అభిమానం, తమకు గౌరవం అన్నారు. నిఖార్సయిన ఉద్యమకారుడు కిశోర్ నాడు తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించిన శ్రీకాంతాచారితో కలిసి పోరాడాడని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రుల వద్దకు పోయి నిధులు సాధించి, పనులు చేయించుకునే స్వాతంత్య్రం కిశోర్కు ఉన్నదని, అలాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యే కావడం మీ అందరి అదృష్టమని అన్నారు. గతంలో ఇక్కడ తుపాకీ మోతలు చూసినం.. నేడు ధాన్యపు రాశులను చూస్తున్నామని, ఇదే నాటికి నేటికి తేడా అని చెప్పారు. నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలా.. సంక్రాంతి పండుగకు వచ్చిపోయే నాయకులు కావల్నా ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. యువకుడు, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు కిశోర్ను ఆశీర్వదిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆశీర్వాద సభ అని వస్తే ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే కిశోర్కుమార్ అప్పుడే హాట్రిక్ కొట్టి విజయోత్సవ ర్యాలీ, సభ నిర్వహిస్తున్నట్లు ఉన్నదని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు.
జాజిరెడ్డిగూడెంలో కల్యాణ మండపం ప్రారంభం
అర్వపల్లి, సెప్టెంబర్ 29 : జాజిరెడ్డిగూడెం వాసి దివంగత ఆర్.విద్యాసాగర్రావు, ఆయన తల్లిదండ్రుల పేర గ్రామస్తుల కోసం నిర్మించిన శ్రీరామరాజు లక్ష్మీ రాఘవరావు కల్యాణ మండపాన్ని మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. విద్యాసాగర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్యాణ మండపాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జాజిరెడ్డిగూడెం గ్రామ శివారులోని సబ్ మార్కెట్ యార్డు ఎదుట ఎమ్మెల్యే కిశోర్కుమార్ సొంత నిధులతో నిర్మించిన విద్యాసాగర్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులను జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్ సన్మానించి యోగానంద లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. అంతకుముందు బీఆర్ఎస్ కార్యకర్తలు 2వేల బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించి
మంత్రులకు ఘన స్వాగతం పలికారు.
నల్లగొండ నీళ్లకుండ అయ్యింది..
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నల్లగొండ నీళ్ల కుండ అయ్యిందని హరీశ్రావు అన్నారు. సహజ సిద్ధంగా వెనుకబాటుకు గురైన తుంగతుర్తి నియోజకవర్గాన్ని గత పాలకులు 50 సంవత్సరాలు పట్టించుకోకపోవడంతో కరువు కాటకాలతో నిత్యం అవస్థలు పడిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులకు తోడు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో పోరాడిన ఎమ్మెల్యే కిశోర్కుమార్ అదే పంథాతో నిత్యం మంత్రుల వెంట పడి నిధులు తెస్తుండడంతో ఐదారేండ్లుగా తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట, సిద్దిపేటతో పోటీ పడుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ తుంగతుర్తిలో కాళేశ్వరం జలాలతో రెండు పంటలు పక్కా చేసిండని చెప్పారు. నాడు తుంగతుర్తిలో కూలి దొరక్క ఎక్కడెక్కడికో పోయారని.. ఈవాళ కూలివాళ్లు దొరుకని పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇవాళ తుంగతుర్తిలో నాట్లు పడాలంటే.. ఆంధ్రా నుంచి మహిళలు, ఛత్తీస్ఘడ్ నుంచి మగ కూలీలు రావాల్సిన పరిస్థితి ఉన్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి గుంటా పచ్చని మాగాణిగా మారిందని
కాంగ్రెస్లో టిక్కెట్ రావాలంటే రూ.10 కోట్లట..
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్లో టిక్కెట్ల బేరం నడుస్తున్నదని, కోట్ల రూపాలకు అమ్ముకుంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. పది కోట్లకు కాంగ్రెస్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నోళ్లు రేపు రాష్ర్టాన్ని అమ్ముకుంటారని, కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చునా.. తెలంగాణ రాకుంటే 24గంటల కరెంట్ వచ్చేదా? కాళేశ్వరం నీళ్లు, కల్యాణలక్ష్మి, తుంగతుర్తికి 100 పడకల దవాఖానకు శంకుస్థాపన చేసేవాళ్లమా? అని ప్రశ్నించారు.
తుంగతుర్తికి కార్పొరేట్ స్థాయి వైద్యం
తమ్ముడు కిశోర్ వచ్చి తనతో కోట్లాడడంతో ఇవాళ రూ.45కోట్లతో వంద పడకల దవాఖానకు శంకుస్థాపన చేశామని, అది పూర్తయితే నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి అన్నారు. 40మంది వైద్యులతో ఇక్కడే 24గంటల వైద్యం అందుతున్నదని చెప్పారు. ఎమ్మెల్యే కిశోర్ ఇంకో 30పడకల ఆసుపత్రిని కోరుతున్నాడని, తప్పకుండా మోత్కూరులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
గతం తల్చుకుంటే పాపాలు, శాపాలే..
గతాన్ని తల్చుకుంటే కరువు కాటకాలు.. పాపాలు, శాపాలే తప్ప మరేమీ గుర్తుకు రావని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఎన్నికల వేళ సీజనల్ గంగిరెద్దుల్లా కాంగ్రెసోళ్లు వస్తున్నారని, అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాము గతాన్ని మర్చిపోలేదు.. ఎరువుల కోసం గంటల తరబడి నిలబడితే ఒక్క బస్తా దొరుకలేదు.. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నదా? అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలన్నారు. కేసీఆర్ పాలనలో ఎరువుల కొరత లేదు.. కరెంట్ కోత లేదు. పండిన ప్రతి గింజా కొంటున్నారని చెప్పాలని సూచించారు. 60ఏండ్లు పాలించి చుక్క నీరు తేలేదు కానీ.. మా కిశోర్ ఐదేండ్లలోనే ప్రతి చెరువు నింపిండు.. ప్రతి ఎకరాకు నీళ్లు తెచ్చిండని చెప్పాలని మంత్రి అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్రావు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్సీ రాజేంద్రప్రసాద్, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, ఎంపీపీ గుండగాని కవిత, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్, నాయకులు కాసోజు శంకరమ్మ, స్నేహలత, సైదులు, దామోదర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.