పెన్పహాడ్, మే 9 : నాలుగు నెలల పాలనలోనే ప్రజలకు నలభై ఏండ్ల నరకాన్ని చూపించిన పాపం కాంగ్రెస్ పార్టీదని, మళ్లీ మోసపోతే గోసపడుతామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పెన్పహాడ్ మండలం లింగాల గ్రామంలో గురువారం రాత్రి ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు, రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలు, గత ప్రభుత్వ పథకాలు ఆగిపోవడంతో పడుతున్న ఇబ్బందులను గ్రామస్తులు వివరించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా భావించి కొట్లాది రూపాలను ఖర్చు చేశామన్నారు. తెలంగాణలోని వనరులు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ ఉండాలని ప్రజలు గ్రహించారని తెలిపారు. కాంగ్రెస్ అబద్ధపు వాగ్దానాలు నమ్మి ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు.
కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంటు కష్టాలు, కరువును ఆహ్వానించినట్లేనని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో నాగార్జున సాగర్లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్లో ఉన్నా సాగునీరు ఇచ్చి పంటలను కాపాడామని తెలిపారు. ప్రస్తుత పాలనలో పంటలను ఎండబెట్టి తూముల వద్ద పోలీసులను కాపలా పెట్టి కిందికి తరలించుకుపోయారని విమర్శించారు. సొంత జిల్లా రైతులకు అన్యాయం జరుగుతున్నా ఇక్కడి మంత్రులు నోరు మెదపకపోవడం మన దౌర్భాగ్యమన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ధాన్యం దిగుబడిలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్గా నిలించిందని తెలిపారు. మళ్లీ మన నీరు, మన కాల్వలు, మన కరెంటు మనకు రావాలంటే కేసీఆర్ చేతికి ఓటు అనే ఆయుధంతో మంత్రదండం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, ఎంపీపీ నెమ్మాది భిక్షం, వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, నాయకులు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, దొంగరి యుగంధర్ పాల్గొన్నారు.