సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 29 : అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలే ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9, 43వ వార్డుల్లో సోమవారం బీఆర్ఎస్ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 43వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన అనతి కాలంలోనే కాంగ్రెస్పై అడుగడుగునా వ్యతిరేకత వచ్చిందన్నారు.
కాంగ్రెస్ మాయ మాటలకు మోసపోయి బీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టలేక పోయామని ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, బీఆర్ఎస్ అత్యధిక ఎంపీ అభ్యర్థులను గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 14 ఏండ్లు పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణను యావత్ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని అన్నారు.
కాంగ్రెస్ పాలకులు మళ్లీ ఆకలి కేకల తెలంగాణగా మార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్కు ఉద్యమాలు కొత్తకాదని, బంగారు తెలంగాణ సాధనకు ఆయన చేస్తున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించారని గుర్తు చేశారు. హామీలు అమలు చేయలేని, అభివృద్ధి చేయడం చేతకాని కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ నాయకులను అడుగడుగునా నిలదీయాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాల సైదులు గౌడ్, నాయకులు ఆకుల లవకుశ, తాహెర్ పాషా, సుంకరి రమేశ్, సాగర్రెడ్డి, రాజా, రమేశ్, సలీమ్, ఉపేందర్రావు, మీనయ్య, లక్ష్మి, సల్మా మస్తాన్, కరుణశ్రీ, మహేశ్వరి పాల్గొన్నారు.