నల్లగొండ ప్రతినిధి, మార్చి25 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో ప్రజలతో మమేకం అయితే విజయం సొంతం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రానున్న లోకసభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుచున్న కంచర్ల కృష్ణారెడ్డి, ఆయన సోదరుడు నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి సోమవారం సాయంత్రం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కంచర్ల బ్రదర్స్ తమ అధినేతకు కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా
సన్మానించారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన సీనియర్ నేతలను కలుపుకొని ప్రణాళికా బద్ధంగా ఎన్నికల వ్యూహాన్ని రూపొందించుకోవాలని ఉపదేశించారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తారని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాలకు చెందిన నాయకులను మానిటరింగ్ చేసుకుంటూ పోతే తప్పక విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమయం చాలా ఉందని, ప్రజలు ఇప్పటికీ బీఆర్ఎస్ వైపే ఉన్నారని, వారిని ఏకతాటి మీదకు తీసుకొచ్చి ఎన్నికల సమరాంగణంలో విజయం సాధించాలని కంచర్ల బ్రదర్స్కు గులాబీ బాస్ కేసీఆర్ ఉద్బోధించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండిన పంటల నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి గడిచిన వారం రోజులుగా ఎండిన పంటపొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు సంబంధించిన నివేదికను అధినేతకు అందజేశారు. ఈ సందర్భంగా స్వయంగా వచ్చి క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి తనను కలిసిన కంచర్ల బ్రదర్స్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నల్లగొండ మండలం ముషంపల్లితోపాటు ఆలేరు నియోజకవర్గ పరిధిలో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.
గడిచిన పది సంవత్సరాలు ఎండిపోని పంట పొలాలు ఈ మారు ఎందుకు ఎండి పోయాయో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితిని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వివరిస్తుంటే చలించి పోయిన కేసీఆర్.. తక్షణమే తానే స్వయంగా క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తానని తెలిపారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో మాట్లాడి రూట్ మ్యాప్ తయారు చేస్తామని కంచర్ల బ్రదర్స్కు చెప్పారు. అత్యధికంగా బోర్లు వేసి నష్ట పోయిన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామం నుంచే ఈ పరిశీలన మొదలు పెట్టే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.