నల్లగొండ, జనవరి 8 : నల్లగొండ నియోజకవర్గంలో దళితబంధు కింద ఆర్థిక సాయం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1100 మంది నిరుపేద దళితులను ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినందున వారికి వెంటనే దళితబంధు యూనిట్లను మంజూరు చేస్తూ గ్రౌండింగ్ చేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టగా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ నియోజకవర్గంలో తొలి విడుతగా 100 మంది లబ్ధిదారులకు దళితబంధు కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసి వారికి కావాల్సిన యూనిట్లు మంజూరు చేయడంతో నేడు వారంతా సంతోషంగా జీవిస్తున్నట్లు తెలిపారు. దాంతో రెండో విడుత కింద 1100 మందిని ఎంపిక చేసి గత ఎన్నికల ముందు ప్రొసీడింగ్స్ అందజేయగా ఎన్నికల కోడ్తో అది ఆగిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ పథకం కింద యూనిట్లు వస్తాయని ఆశపడ్డ దళితుల ఆశలు వమ్ము అవుతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి పాటుపడాలని, అందుకు వెంటనే లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం దళితబంధు సాధన కమిటీ కన్వీనర్ పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా ఒక చట్టం చేస్తే, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం దానిని అమలు చేసే బాధ్యతను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
లేదంటే ప్రభుత్వాలు చేసే చట్టాలకు, పథకాలకు విలువ ఉండదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, నల్లగొండ మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, బకరం వెంకన్న, అద్దంకి దయాకర్, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, చింత సైదులు, కందుల రమేశ్, విమలమ్మ, యాదమ్మ, జాకటి బాలరాజు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
దళితులు ఆత్మగౌరవంగా జీవించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకం తెచ్చింది. నా పేరున దళితబంధుకు దరఖాస్తు చేస్తే ఎంపికవడంతో అధికారులు నాతో బ్యాంకు ఖాతా తీయించారు. సూపర్ మార్కెట్, బ్యూటీ పార్లర్, కారు కొనుగోలుకు సంబంధించి యూనిట్లను ఎంపిక చేసుకున్నాం. అధికారులు వీటిలో ఒకటి ఇస్తామన్నారు. ప్రభుత్వం మారడంతో దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదు. రెక్కాడితే డొక్కాడని బతుకులు మావి. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే గత ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారందరికీ యూనిట్లను గ్రౌండింగ్ చేయాలి.
– బొల్లు క్రాంతి, అక్కచెల్మ
కేసీఆర్ సర్కారు తెచ్చిన దళితబంధు పథకంతో నా జీవిత కల సాకరమైందని ఆశ పడ్డాను. దళితబంధులో ట్రాక్టర్, కారు, టెంట్హౌజ్ పెట్టుకున్నా. స్వయానా అప్పటి జిల్లా కలెక్టరే నాకు ప్రొసీడింగ్స్ కాపీ అందజేశారు. కానీ, నేడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దానిని పట్టించుకోకపోవడం దారుణం. ప్రస్తుతం కూలి చేసుకుంటూ జీవనం గడుపుతున్నా. ఆలస్యం చేయకుండా ప్రభుత్వం తక్షణమే దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ను పూర్తిచేయాలి.
-బాకి నర్సింహ, అన్నెపర్తి, నల్లగొండ