మిర్యాలగూడ, జనవరి 20 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో రైతులు బోరుబావులు, చెరువుల కింద 30 శాతం వరి పంటను సాగు చేసినట్లు తెలిపారు.
భూ గర్భజలాలు అడుగంటిపోవడంతో పంటచేలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. పంటలను కాపాడేందుకు ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలని కోరారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్లో 524 అడుగుల నీటిమట్టం ఉందని, అందులోంచి 15 టీఎంసీలను వాడుకునే అవకాశం ఉంటుందన్నారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆల్మట్టి ద్వారా నీటిని విడుదల చేయించాలని కోరారు.
నీటి విడుదలపై ప్రభుత్వం స్పందించకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేశ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి, రామ్మూర్తి, అంజద్ పాల్గొన్నారు.