భువనగిరి అర్బన్, ఏప్రిల్ 10 : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశంతో కలిసి ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కరెంటు కష్టాలతో మోటర్లు కాలిపోతున్నాయని, సాగునీరందక పంటలు ఎండి పోతున్నాయని చెప్పారు.
చేతికొచ్చిన పంట ఎండి పశువులు, గొర్రెలకు మేపుకోవాల్సి వస్తున్నదన్నారు. గత కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయ ద్వారా 47 వేల చెరువులను బాగు చేసి నీటితో నింపారని, చెక్డ్యామ్లు ఏర్పాటు చేయడంతో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. కాళేశ్వరంలో 85 పిల్లర్లు ఉంటే ఒక్క పిల్లర్ కుంగిందనే సాకుతో, పంటలకు సరిపోను నీళ్లున్నా మాజీ సీఎం కేసీఆర్పై కోపంతో మోటర్లు నడుపకుండా రైతుల పొలాలను ఎండపెట్టి వారిని సీఎం రేవంత్రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ పాలనలో లేని కరెంట్ కష్టాలు నాలుగు నెలల్లో ఎక్కడి నుంచి వచ్చాయని, ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు కాలిపోతున్నాయని, రైతుబంధు, రైతుబీమా ఇవ్వడానికి ఎందుకు సాకులు చెబుతున్నారని ప్రశ్నించారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకన్నా మెరుగైన వ్యక్తి అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు సుదగాని హరిశంకర్గౌడ్, మాజీ జడ్పీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఈ నెల 22న బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న అనంతరం పార్టీ జిల్లా కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు.