చిట్యాల, ఏప్రిల్ 29 : మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ దేవుళ్లపై ప్రమాణాలు చేసే స్థాయికి దిగజారాడాని, ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా లేడని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. చిట్యాలలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గృహలక్ష్మి పథకంలో నెలకు రూ.2,500 ఇస్తానని, ఆడపిల్లల పెండ్లిళ్లకు తులం బంగారం అని చెప్పి మహిళలను మోసగించాడన్నారు.
రైతు రుణ మాఫీ అని రైతులను మోసగించి ఇప్పుడు ఆగస్టు 15న మాఫీ చేస్తానని కొత్త డ్రామాకు తెరలేపి దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, ఆర్టీసీని దివాళ తీయించి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్నదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.