నకిరేకల్, డిసెంబర్ 16 : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దామని.. అలాగే లోపాలను సరి చేసుకుందామని.. బీఆర్ఎస్ శ్రేణులు మనోధైర్యం కోల్పోవద్దని.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. శనివారం నకిరేకల్లోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజవర్గస్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు, నాయకులు సమష్టిగా ఉండి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి ప్రజలను జాగృతం చేయాలని కోరారు. ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.
ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని, లోకల్బాడీలో మంచి స్థానం సంపాదించుకునేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. గ్రామగ్రామాన కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీని బలోపేతం చేసుకుందామని సూచించారు. ఓటమికి పూర్తిబాధ్యత తనదేనని పేర్కొన్నారు. అందరం ఆత్మపరిశీలన చేసుకుని కుటుంబ సభ్యుల్లా ముందుకు సాగుదామన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, 6 నెలల సమయం తరువాత పథకాలు అమలుకాకపోతే ప్రజల తరఫున ప్రశ్నించేందుకు ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దిశగా ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్లో ఉన్నవారంతా నిజాయితీగా ఉండి పార్టీని పటిష్టపర్చుకుని, గత ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకుందామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్, తరాల బలరాం, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, కన్నెబోయిన జ్యోతి, కొలను సునీతావెంకటేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలువేరు ప్రభాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, ఏడుకొండల్, మారం వెంకట్రెడ్డి, బైరెడ్డి కరుణాకర్రెడ్డి, అయిలయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్శ్రేణులు పాల్గొన్నారు.