కోదాడ, జూలై 7: కోదాడ డివిజన్ వ్యాప్తంగా సంవత్సరంన్నర కాలంలో పోలీసులు సంబంధిత అధికారుల మద్దతుతో యథేచ్ఛగా గంజాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని గొప్పలు చెప్పుకునే మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతులు అడ్డుకోలేకపోతున్నారని, పాలన గాడి తప్పిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం కోదాడలోని తన నివాసంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల నుంచి గంజాయి తెచ్చి కోదాడ డివిజన్లోని మండలాలతో పాటు గ్రామాల్లో విక్రయించడంతో యువకులు మత్తులో మునిగితేలుతున్నారన్నారు. ఇటీవల కోదాడ మండలంలోని దోరకుంట, అనంతగిరి మండలంలోని పలు గ్రామాల్లో గంజాయి పట్టుబడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గతంలో గంజాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని గగ్గోలు పెట్టిన వీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారన్నారు… పోలీసులతో కుమ్మకై దళారులు ఆంధ్రా నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేయడంతో పాటు పాలేరు వాగు పరీవాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఎక్కువ రేటుకు అమ్ముతున్నా పట్టించుకునే దిక్కేలేదని మండిపడ్డారు.
పరోక్షంగా.. అధికార పార్టీ నేతలు అధికారులతో కుమ్మకై ఈ నిర్వాకం కొనసాగిస్తున్నారని లేకపోతే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణాలు, పల్లెలు, పచ్చదనంతో కళకళలాడిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ నేడు గ్రామాల్లో ట్రాక్టర్ డీజిల్కు డబ్బుల్లేకపోవడంతో పారిశుద్ధ్య లోపంతో కంపు కొడుతున్నాయని విమర్శించారు. కోదాడ మున్సిపాలిటీ మురికి కూపంగా మారిందని సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే దిక్కే లేదన్నారు.. పలు శాఖలతో పాటు మున్సిపాలిటీలోని దుకాణాలపై కుప్పలు, తెప్పలుగా ఉత్తమ్ పద్మావతిరెడ్డి దంపతులు సమీక్షలు నిర్వహిస్తున్నా ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటంలేదన్నారు.
కోదాడ ప్రభుత్వ దవాఖానలో రెండు సంవత్సరాలుగా ప్రసూతి వైద్యురాలు లేక నిరుపేదలు వేలాది రూపాయల ఖర్చుతో ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించాల్సి వస్తోందని, ఇటువంటిప్పుడు సమీక్షల వల్ల ఏం ప్రయోజనమని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, రైతులకు అవసరమైన యూరియాను కూడా సకాలంలో సరఫరా చేయలేకపోవడం దురదృష్టకరం అన్నారు. సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసి సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవం తప్పదన్నారు.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బొల్లం డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్కుమార్, కవితా రమేశ్, నర్సిరెడ్డి, భూపాల్రెడ్డి, సురేశ్, నయీమ్, మధుసూదన్రెడ్డి, కర్ల సుందర్బాబు, లలితా, రామారావు, వెంకట్, చంద్రశేఖర్, ఇమ్రా న్, ఉపేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.