కేతేపల్లి, అక్టోబర్ 5 : రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఇనుపాముల శివారులో మల్లన్నగుట్టపై నూతనంగా నిర్మించనున్న పచ్చలపార్వతీ సోమేశ్వరాలయం వద్ద బుధవారం స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చోళులు, కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతన ఆలయాలు నేడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఈ ఆలయాలు నిలిచాయన్నారు. ఈ ఆలయాలు పూర్వవైభవం కోల్పోకుండా ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు. బీ(టీ)ఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆదరణ రావాలని ఈ సందర్భంగా మంత్రి కోరుకున్నారు. అనంతరం ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
నిర్మాణ పనులకు శంకుస్థాపన
రూ.4 కోట్లతో పునర్నిర్మాణం చేయనున్న శివాలయం నిర్మాణ పనులకు దాతలు, గ్రామానికి చెందిన ప్రముఖులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేదపండితుడు వావిలాల వేణుశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపి పనులు ప్రారంభించారు. బీ(టీ)ఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, దాతలు సర్పంచ్ జాల వెంకట్రెడ్డి, చైర్మన్ కానుగు యాదగిరిగౌడ్, బి.సంజీవరెడ్డి, బి.సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.