నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు నల్లగొండ మరోసారి వేదిక కానుంది. రాష్ట్రంలోనే తొలి ఎన్నికల ప్రచార రోడ్ షోకు మిర్యాలగూడ సిద్ధమవుతున్నది. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడలో కేసీఆర్ తొలి రోడ్ షో జరుగనుంది. అనంతరం 7గంటలకు సూర్యాపేటలో రోడ్ షోలో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. వరుసగా రెండు రోజులపాటు ఉమ్మడి జిల్లా పరిధిలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం, పర్యటన ఉండడంతో బీఆర్ఎస్ ముఖ్యులంతా దానిపైనే దృష్టి కేంద్రీకరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కీలకమైన రెండు కార్యక్రమాలకు కూడా ఉమ్మడి జిల్లానే వేదికగా ఎంచుకోవడం తెలిసిందే. కేఆర్ఎంబీకి నాగార్జున సాగర్ ప్రాజెక్టును అప్పజెప్పడాన్ని నిరసిస్తూ నల్లగొండ గడ్డ మీద నుంచే కేసీఆర్ తొలిసారి గర్జించారు. భారీగా పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు తరలిరావడంతో మంచి స్పందన వచ్చింది.
అనంతరం గత నెల 31న ఎండిన పొలాలను పరిశీలించి, రైతులను ఓదార్చడానికి కూడా ఉమ్మడి జిల్లా నుంచే కేసీఆర్ శ్రీకారం చుట్టారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలో పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతుల పక్షాన రేవంత్ సర్కార్ను నీలదీశారు. ఆ వెంటనే ప్రభుత్వం వైపు నుంచి కాళేశ్వరంతో పాటు సాగర్ నుంచి కూడా నీళ్లు విడుదల చేయక తప్పలేదు. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం కూడా నల్లగొండ నుంచే షురూ చేస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ అనేక కీలక సందర్భాల్లో నల్లగొండనూ వేదికగా చేసుకుని కేసీఆర్ కార్యాచరణను మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ సర్కార్ హామీల అమలులో వైఫల్యం చెందడంతో పాటు సాగునీళ్లు ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా మోసం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా పునరాలోచనతో కాంగ్రెస్పై ఆగ్రహంతో ప్రజలు తిరిగి కేసీఆర్ వైపే చూస్తున్న పరిస్థితి నెలకొంది.
లోక్సభ ఎన్నికల వేదికగా కాంగ్రెస్ బండారం బయటపెట్టేందుకు కేసీఆర్ సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో రేపు జరుగనున్న మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రోడ్ షోకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లను జగదీశ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సోమవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గం ముఖ్య నేతలతో కేసీఆర్ రోడ్ షో పై జగదీశ్ రెడ్డి సమీక్షించారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సోమవారం సాయంత్రం మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, భూపాల్ రెడ్డి తదితరులతో జగదీశ్రెడ్డి రోడ్ షో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే కేసీఆర్ రోడ్ షోలను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి పార్టీ శ్రేణులు, జిల్లాలో ప్రజలకు పిలుపునిచ్చారు.
నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచ ర్ల కృష్ణారెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చే పార్టీ నేతలు, కార్యకర్తలతో హైదరాబాద్ రోడ్ లోని లక్ష్మి గార్డెన్స్ నుంచి క్లాక్ టవర్ మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. బుధవారమే కేసీఆర్ రోడ్ షో ఉన్న నేపథ్యంలో నేటి నామినేషన్ను పెద్దగా హంగామా లేకుండా నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.