యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 3 : ప్రజాస్వామిక పద్ధతిలో జరిగే ఎన్నికల్లో పాల్గొంటే ఓటమి పాలవుతామని భయంతో కౌన్సిలర్ అభ్యర్థులను కొనుగోలు చేస్తున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఖబడ్డార్ అంటూ ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ గొంగిడి మహేందర్రెడ్డి మండిపడ్డారు. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 12 వార్డులకు చెందిన బీఆర్ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఫొన్లు చేసి భయబ్రాంతులకు గురి చేసి పోటీలో లేకుండా చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇందుకు నిరసనగా మంగళవారం యాదగిరిగుట్టలో నిరసన ర్యాలీని నిర్వహించారు. 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల మమతాసాయియాదవ్ను రూ. 3 కోట్లకు కొనుగోలు చేసిన తీరును నిరసిస్తూ పట్టణంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దిష్టిబొమ్మను దహనం చేసి, ఎంపీడీవో కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు శవయాత్ర నిర్వహించారు. ఎమ్మె ల్యే బీర్ల అయిలయ్య తీరును వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కౌన్సిలర్లను కొనుగోలు చేసిన దాఖలాలు లేవన్నారు. 10వ వార్డులో సునాయసంగా గెలిచే బీఆర్ఎస్ అభ్యర్థిని డబ్బుతో ప్రలోభపెట్టి కొనుగోలు చేశారన్నారు. 11వ వార్డు అభ్యర్థికి పట్టణానికి చెందిన వైద్యుడు గిరిధర్ మాట్లాడిన తీరును చూస్తే కాంగ్రెస్ నాయకుల ప్రలోభాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుందన్నారు. యాదగిరిగుట్టలోని 12 వార్డుల ప్రజలు కాంగ్రెస్ నేతలను అక్రమాలను గమనించాలన్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి చూసి కారు గుర్తుకు ఓటేయాలన్నారు.
జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం
ప్రజాస్వామికబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం తనకు లేదని గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. త్వరలో కలెక్టర్ను కలిపి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, నాయకులు కసావు శ్రీనివాస్, తోటకూరి బీర య్య, నర్సింహ గౌడ్, దండబోయిన అనిల్, వాసం రమేశ్, కరుణాకర్, సర్పంచ్ మారెడ్డి కొండల్రెడ్డి, కవిడే మహేందర్, దేవేందర్, గుండ్లపల్లి వెంకటేశ్ గౌడ్, సయ్యద్ బాబా, పీటీ శ్రీనివాస్, దండెబోయిన అనిల్ తదితరులు పాల్గొన్నారు.