నీలగిరి, డిసెంబర్ 23 : జిల్లాలో నేరాల సంఖ్య తగ్గినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2022 వార్షిక క్రైమ్ బులెటిన్ను ఆమె విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించినట్లు చెప్పారు. 32 రకాల కేసుల్లో 2021లో 9,535 కేసులు నమోదైతే ఈ ఏడాది 7,343 కేసులు మాత్రమే నమోదైనట్లు తెలిపారు. ఐపీసీ సెక్షన్ల కేసులను నియంత్రించగలినట్లు చెప్పారు.
పకడ్బందీగా మునుగోడు ఉప ఎన్నికలు..
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మునుగోడు ఉప ఎన్నికను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. 3,514 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించినట్లు ఎన్నిక సందర్భంగా రూ.2,24,54,270 నగదుతో పాటు రూ.2,42,750 విలువైన 305.41 లీటర్ల లిక్కర్ను రూ.13,600 విలువైన చీరెలను సీజ్ చేసినట్లు తెలిపారు.
సంచలన్మాతక కేసుల పరిశోధన..
ఆడపిల్లల అమ్మకాలు దృష్టికి రావడంతో దేవరకొండలో ప్రత్యేకమైన దృష్టి సారించి శిశువులను విక్రయిస్తున్న ఐదుగురు సభ్యులతో కూడిన విక్రయ రాకెట్ ముఠాను అరెస్ట్ చేశామన్నారు. అంతేగాకుండా మిర్యాలగూడ ప్రాంతంలో అంతరా్రష్ట్ర దొంగలను, దొంగిలించిన కార్ల చాయిస్ నంబర్లు మార్చే ముఠాను, చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠాను, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.6.98 కోట్ల విలువైన లారీలు, బైక్లు, కార్లు, బంగారం, నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మహిళలు, చిన్నారుల రక్షణకు..
మహిళలకు అన్లైన్లో వేధింపులు, చీటింగ్, బెదిరింపులు పాల్పడిన కేసుల్లో ఆకతాయిలకు తగిన గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు. 58 కేసులు నమోదు చేసి 320 మందికి కౌన్సెలింగ్ నిర్వహిండంతో పాటు 750 అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన వారికి రూ.35.35 లక్షలు నష్ట పరిహారంగా చెల్లించామని, ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ పేరుతో చిన్నారులను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేసి 230 మంది చిన్నారులను బడిలోకి పంపినట్లు చెప్పారు.
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా..
ఆంధ్రాతో పాటు, ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి నల్లగొండ జిల్లా మీదుగా ఇతర రాష్ర్ర్టాలకు గంజాయి సరాఫరా చేస్తున్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాలతో అరికట్టడం జరిగిందన్నారు. 23 కేసుల్లో 101 మందిని అరెస్టు చేసి 2795.856 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు చెప్పారు.
రోడ్డు ప్రమాదాల్లో 320 మంది మృతి..
జిల్లా వ్యాప్తంగా 786 రోడ్డు ప్రమాదాలు జరుగగా 320 మంది చనిపోయారు. 704 మంది క్షత్రగాతులయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేసి ప్రమాదానికి గల కారణాలను అన్వేషించి నిర్మూలనకు కృషి చేశామని ఎస్పీ తెలిపారు. డయల్ 100 ద్వారా 46,011 ఫిర్యాదులు రాగా వారికి సత్వర న్యాయం అందించేలా కృషి చేశామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ప్రభాకర్రావు, డీఎస్పీలు నర్సింహారెడ్డి, నాగేశ్వర్రావు, మొగిలయ్య, ఏఆర్ డీఎస్పీ రమేశ్, సీఐలు నిగిడాల సురేశ్, శివరాంరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.