నందికొండ, ఆగస్టు 16 : వరుసగా ఆరో రోజు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద జోరు కొనసాగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్కు మంగళవారం 4,39,116 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 3,30,946 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312 టీఎంసీ) కాగా ప్రస్తుతం 586.10 (300.8385 టీఎంసీ) అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి కుడికాల్వకు 8,642 క్యూసెక్కులు, ఎడుమ కాల్వకు 8,541, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 28,945, ఎస్ఎల్బీసీకి 1800, ఎల్ఎల్సీకి 300, మొత్తం 3,79,174 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పర్యాటకుల సందడి
నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగడంతో ఆ జలదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో డ్యాం పరిసరాలు పర్యాటకులతో సందడిగా మారాయి. శివాలయం పుష్కరఘాట్, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం సమీపం, కొత్త వంతెన, లాంచీస్టేషన్ జనంతో కిటకిటలాడాయి. కృష్ణా నదిలో లాంచీ జాలీ ట్రిప్పు, నాగార్జునకొండకు లాంచీల్లో వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి కనబర్చారు.
3 గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం 2,832.48 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 3 గేట్ల ద్వారా 840.37 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దాంతో పాటు కుడి కాల్వకు 249.59, ఎడమ కాల్వకు 220.22 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 638.95(2.98 టీఎంసీలు)అడుగులు ఉన్నట్లు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.