నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, 525.40 అడుగుల్లోనే నీరున్నా.. రైతాంగం మేలు
కోరి సీఎం కేసీఆర్ ఎడమ కాల్వకు నీళ్లిచ్చి పంటకు ప్రాణం పోశారు. దాంతో ఇప్పుడు రైతు చేతికి మంచి పంట వస్తున్నది. ఈసారి చీడపీడలు లేకపోవడం, సన్న వడ్లు అవడంతో మద్దతుకు మించి ధర లభిస్తున్నది. క్వింటాకు రూ.2,800 వరకు ధర పడుతుండడంతో రైతాంగం సంతోషంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎడమ కాల్వను ఎండబెట్టి డెల్టాకు నీటిని తరలించుకుపోయిన సమైక్య పాలకుల తీరును, స్వరాష్ట్రంలో తెలంగాణ ఆత్మగల్ల బీఆర్ఎస్ సర్కారు చొరవను గుర్తు చేసుకుంటూ సీఎం కేసీఆర్కు రైతులు
కృతజ్ఞతలు చెప్తున్నారు.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ప్రధాన జీవనాధారం వరి సాగు. ఇక్కడి పల్లెలు పచ్చగా ఉంటేనే రైతు కుటుంబాలతోపాటు సమీప పట్టణాల్లో వ్యాపారాలు కూడా బాగుంటాయి. కానీ, అందుకు కాలం కలిసి రావాలి. ఎగువన కృష్ణమ్మ పొంగిపొర్లాలి. కాల్వల్లో పరవళ్లు తొక్కుతూ దిగువ వరకూ నీళ్లు రావాలి. క్లిష్ట పరిస్థితుల్లో అయినా అవకాశం మేరకు ఆయకట్టుకు నీళ్లివ్వాలనే ఆలోచన ఉన్న పాలకులు కావాలి.
మిర్యాలగూడ, నవంబర్ 6 : సీమాంధ్రుల పాలనలో సాగర్ ఎడమ కాల్వ కింద అనేక పర్యాయాలు పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించినా కాపాడేందుకు కనీసం ప్రయత్నించలేదు. ఎడమ కాల్వకు నీటిని వదులాలనే సోయి ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు లేకపోయేది. సమైక్య పాలకులు తెలంగాణ రైతులపై పక్షపాత వైఖరి అవలంబించేది. సాగు నీరు వదలకపోవడం, వర్షాభావ పరిస్థితుల వల్ల ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో అనేక పర్యాయాలు పంటలు నిలువునా ఎండిపోయి ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
మరోవైపు కుడి కాల్వకు నీళ్లు వదులుకొని ఆంధ్రా రైతుల పంటలను కాపాడారు. కానీ.. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల పక్షాన నిలిచి అవసరమైనప్పుడల్లా నీటిని అందిస్తూ పంటలను కాపాడుతున్నది. ఈ క్రమంలో ఇటీవల సాగర్ డెడ్ స్టోరేజీలో ఉన్నా.. చివరి దశలో ఉన్న పంటలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఎడమ కాల్వకు నీటిని వదిలి వరి పైరుకు జీవం పోశారు. దీంతో అధిక దిగుబడి సాధించడంతోపాటు మార్కెట్లో మద్దతుకు మించి ధర పలుకడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వానకాలం తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు రాలేదు. దీంతో ఎడమ కాల్వ ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తుండడంతో రైతులు బోరుబావుల ఆధారంగా వరి పంట వేశారు. మొదట వర్షాలు కురువడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సాగర్ ఎడమ కాల్వ కింద సుమారు 1.50లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. రెండు నెలల పాటు పొలాలు సక్రమంగానే పారినా వర్షాలు తగ్గిపోవడం, ఎండల తీవ్రతతో బోరుబావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. పొట్ట దశలో పొలాలు ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయాన్ని ఆయకట్టు రైతులు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్కుమార్కు విన్నవించారు. వారు రైతుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు అత్యంత తక్కువగా ఉన్నా.. పంటలు ఎండిపోకూడదనే ఉద్దేశంతో ఎడమ కాల్వకు పది రోజులు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత రైతుల కోరిక మేరకు మరో ఐదు రోజులు అదనంగా ఇవ్వడంతో వరి పంటలు జీవం పోసుకున్నాయి.
సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ఎక్కువగా స్వల్పకాలిక వరి వంగడాలైన హెచ్ఎంటీ, చింట్లు, కావేరి వంటి సన్న రకాలను సాగు చేశారు. వరి పొట్ట దశలో ఉన్నప్పుడు బోరుబావుల్లో నీరు తగ్గిపోవడంతో ప్రభుత్వం 15రోజులు నీటిని విడుదల చేసి కాపాడింది. దీంతో ఆయకట్టు ప్రాంతంలో ఎకరాకు 40-45 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తున్నది. దీనికితోడు మార్కెట్లో మద్దతుకు మించి ధర పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం క్వింటాలుకు మద్దతు ధర రూ.2203 ఉండగా.. మార్కెట్లో రూ.2500 నుంచి రూ.2850 వరకు అమ్ముడు పోతున్నాయి. ట్రాక్టర్ వడ్లు పడుతుండగా.. ఒక్క లోడుకు రూ.లక్షా 70వేలకు పైనే వస్తున్నది. సాగర్ వదలడం వల్లే పంటలు చేతికొచ్చి అధిక దిగుబడి వచ్చిందని, ఎక్కువ ధర పలుకుతుండడంతో మంచి ఆదాయం వస్తున్నదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లిచ్చి పంటలను కాపాడిన సీఎం కేసీఆర్కు తెలిపారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఈ వానకాలం ప్రాజెక్టులోకి నీరు రాకపోవడంతో రైతులంతా బోరుబావుల ఆధారంగా వరి సాగు చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురువడం వల్ల పొలాలు సులువుగానే తడిపి వరి నాట్లు వేశారు. రెండు నెలలపాటు పొలాలు మంచిగనే పారినా బోరుబావుల్లో నీళ్లు తగ్గిపోయి పొట్టదశలో ఎండిపోయే పరిస్థితి దాపురించిందని రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పంటలను కాపాడాలని ఆయకట్టు ఎమ్మెల్యేలమంతా కోరాం. ఎడమ కాల్వ కింద సుమారు 1.50లక్షల ఎకరాలు సాగు చేశారని, పది రోజులపాటు నీటిని వదిలితే పంటలు పండుతాయని చెప్పాం. రైతుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి సాగర్ డెడ్ స్టోరేజీలో ఉన్నా.. ఎడమ కాల్వకు పది రోజుల పాటు నీటిని వదలాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత మరో ఐదు రోజులపాటు ఇచ్చి ఎండిపోతున్న పంటలను కాపాడారు.
– ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు
నందికొండ, నవంబర్ 6 : స్వరాష్ట్రంలో సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు ఏటా సాగునీరు అందుతున్నది. డెడ్ స్టోరేజీలో ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పంటలకు నీటిని విడుదల చేస్తున్నది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ లెవల్ 510 అడుగులు. కాగా, ఈ ఏడాది అక్టోబర్లో నీటి నిల్వ 525.40 అడుగులు ఉన్నది. ఎగువ నుంచి వరద వచ్చే పరిస్థితి లేకపోయినా పంటలను కాపాడడానికి 5 టీఎంసీల నీటిని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలో ప్రతి ఏటా ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రెండు పంటలకు నీళ్లిస్తున్నారు. 2014లో 515 అడుగులు, 2016లో 514.20 అడుగుల నీటిమట్టం ఉన్నా నీటిని విడుదల చేశారు. చివరి ఆయకట్టుకు, లిఫ్ట్ దిగువన ఉన్న భూములకు కూడా నీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్దే.
సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో నాకు ఐదెకరాల భూమి ఉంది. ఈ వానకాలం కాల్వకు నీళ్లు రాకపోవడంతో రెండు బోరుబావుల ఆధారంతో వరి పంట వేశాను. పొలం ఈత పట్టినంక నీళ్లు సరిగాలేక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వరుస తడులు పెట్టినా పంట పూర్తిగా అదిరిపోయింది. ఈ దశలో రైతులమంతా కలిసి ఎమ్మెల్యే భాస్కర్రావును కలిసి ఎడమ కాల్వకు నీటిని వదలాలని కోరాం. ఆ తర్వాత సీఎం కేసీఆర్ 15రోజులు నిరంతరాయంగా నీటిని వదిలిండ్రు. దీంతో ఎండిపోతున్న వరి పైరు జీవం పోసుకున్నది. మంచి దిగుబడులు రావడమే కాకుండా అధిక ధర లభించింది.
– లావూడి హర్యానాయక్, రైతు, లావూడితండా, మిర్యాలగూడ మండలం
ప్రస్తుత వానకాలం సీజన్లో బోర్ల కింద 12ఎకరాలు సాగు చేశా. పంట పొట్ట దశకు వచ్చేసరికి నీళ్లు సరిపోక వాడుముఖం పట్టింది. ఎడమ కాల్వకు పది రోజులు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే భాస్కర్రావును కోరాం. స్పందించిన ప్రభుత్వం 15రోజులపాటు సాగర్ ఎడమ కాల్వకు నీటిని వదిలింది. దీంతో లిఫ్ట్లు ఆన్ చేయగా మా పొలాలకు నీళ్లు చేరి మళ్లీ జీవం పోసుకున్నాయి. సాగర్ ఎడమ కాల్వ నీళ్లు వదలబట్టే మా పొలాలు పండి అధిక దిగుబడి వచ్చింది. నీళ్లు రాకపోతే 12 ఎకరాల్లో ఆరు ఎకరాలు ఎండిపోయే పరిస్థితి ఉండేది. దాంతో నేను తీవ్రంగా నష్టపోయేవాడిని. ఎమ్మెల్యే భాస్కర్రావు చొరవతో నీళ్లు రావడంతోనే మా పంటలు పండాయి.
– మేకల సంజీవరెడ్డి, రైతు, తిమ్మారెడ్డిగూడెం, వేములపల్లి మండలం