ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి
ఆత్మకూరు(ఎం), జూలై 11 : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఆయిల్ పామ్ సాగుపై రైతులను చైతన్యపర్చాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని ఉప్పలపహాడ్ గ్రామ రైతు ఏనుగు దయాకర్రెడ్డి 10ఎకరాల భూమిలో ఆయిల్ పామ్ సాగుకు సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్న ఆయన సోమవారం గ్రామానికి వచ్చి భూమిని పరిశీలించారు. ఈ నెల 13న ఉప్పలపహాడ్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 2లక్షల ఎకరాల్లో సాగుకు రైతులకు అవగాహన కల్పించామని తెలిపారు. ఇప్పటికే 8జిల్లాల్లో 80వేల ఎకరాల్లో సాగు చేశారని మిగతా 24జిల్లాల్లో ప్రైవేట్ యాజమాన్యం సహకారంతో 1.24లక్షల ఎకరాల్లో సాగుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
మోత్కూర్ మండలంలోని పాలడుగు గ్రామంలో 4లక్షల ఆయిల్ పామ్ మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో 3వేల ఎకరాల్లో సాగుకు అనువైన భూములు గుర్తించామని తెలిపారు. మొక్కల పెంపునకు వాడే డ్రిప్ కోసం ఎస్సీ, ఎస్టీలకు వందశాతం, బీసీలకు 80శాతం, ఓసీలకు 70శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు సంబంధిత ఫీల్డ్ ఆఫీసర్ల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్గౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, జిల్లా డైరెక్టర్ కోరె భిక్షపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథగౌడ్, కూరెళ్ల సర్పంచ్ బాషబోయిన ఉప్పలయ్య, మాజీ వైస్ ఎంపీపీ ఏనుగు దయాకర్రెడ్డి, రైతుబంధు సమితి టీరేపాక గ్రామ కోఆర్డినేటర్ గడ్డమీది రమేశ్గౌడ్, స్వామి, మల్లయ్య, సుదర్శన్రెడ్డి, ముత్యంగౌడ్, బాలరాజు, పర్వతాలు, గణేశ్ పాల్గొన్నారు.