నల్లగొండ, ఏప్రిల్ 2 : రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమైనందున దానికి బాధ్యత వహిస్తూ రైతులకు ఎకరాకు రూ.25వేల నష్ట పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని, రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మంగళవారం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్టారెడ్డితో కలిసి ఆయన కలెక్టరేట్లో డీఆర్ఓ రాజ్యలక్ష్మికి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో రవీంద్రకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని అన్నారు. సీఎం రేవంత్, మంత్రుల నిర్లక్ష్యం వల్లే నీళ్లు, కరెంట్ లేక రైతులు ఆగమైతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకునే శ్రద్ధ రైతులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లలో రైతులు, ప్రజలకు ఏ ఇబ్బందీ రాలేదని, కాంగ్రెస్ సర్కారు వచ్చిన నాలుగు నెలల్లోనే గడ్డు పరిస్థితులు వచ్చాయని అన్నారు. కాళేశ్వరంలో ఒకటి రెండు పిల్లర్లు కుంగితే వాటిని మరమ్మతులు చేసేదే పోయి మాజీ సీఎం కేసీఆర్ను బదనాం చేయాలనే కుట్రతో చుక్కనీరు ఎత్తిపోయకుండా పంట పొలాలు ఎండబెట్టారని మండిపడ్డారు. గతంలో కేఆర్ఎంబీ అనుమతితో డెడ్ స్టోరేజీలోనూ సాగర్ నుంచి నీటిని అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ది అన్నారు. కాంగ్రెస్ సర్కారు కేఆర్ఎంబీనీ కేంద్రం చేతుల్లో పెట్టి సాగు నీటిని ఇవ్వకపోవడం వల్ల పంటలు ఎండిపోయాయని అన్నారు. ప్రస్తుతం తాగు నీటి సమస్య కూడా తీవ్రమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలపై దాడులు, కేసులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతున్నదని, రైతులు, ప్రజా సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
అధికార పార్టీకి కొమ్ము కాయడం సరికాదు
ఇది ప్రజాస్వామ్య దేశమని, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తేవడానికి తాము కలెక్టరేట్కు వస్తే జిల్లా ఉన్నతాధికారులు తమను కలువకపోవడం మంచి పద్ధతి కాదని రవీంద్రకుమార్ అన్నారు. గతంలో కూడా ఇదే విధంగా కలెక్టర్ ప్రవర్తించారని, కలెక్టర్, అదనపు కలెక్టర్లు అధికార పార్టీకి కొమ్ము కాయడం సరికాదని తెలిపారు. వినతి పత్రం ఇవ్వడానికి ఉదయం నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ఫోన్ చేస్తే ఎవరు కూడా ఎత్తలేదని, పైగా ఆఫీసులో ఉండకుండా బయటికి వెళ్లడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వెంట రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షుడు రామచంద్రనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జునరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, ఆలకుంట్ల నాగరత్నం రాజు, దోటి శ్రీనివాస్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, నారబోయిన భిక్షం, బకరం వెంకన్న, తిప్పర్తి వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, నల్లగొండ, తిప్పర్తి, కనగల్ బీఆర్ఎస్ మండలాధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగోని యాదయ్య, పట్టణ పార్టీ కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి, మెరుగు గోపి, నల్లగొండ మండల పార్టీ కార్యదర్శి బడుపుల శంకర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున, జి. జంగయ్య, నాగరాజు పాల్గొన్నారు.