అనంతగిరి, ఫిబ్రవరి 13 : రైతులకు యూరియా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. రైతులు ఎవరూ క్యూలైన్లో కనిపించకూడదని భావించిన ప్రభుత్వం యాప్ ను అందుబాటులో తెచ్చింది. యాప్ లో సైతం రైతులకు యూరియా బుక్ అవ్వక నానా అవస్థలు పడుతున్నారు. సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని గంటలకొద్ది నిరీక్షించినా ఒక్క యూరియా కట్ట కూడా బుక్ కాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న స్టాక్ అంతా క్షణాల్లోనే మాయమై పోతుండడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన రైతులకు యూరియా ఆన్లైన్లో బుక్ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం నిరసనకు దిగారు. కోదాడ- అనంతగిరి రోడ్డుపై పురుగుమందు డబ్బాలతో బైఠాయించి నిరసన తెలిపారు.
అనంతరం ఖానాపురం ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో వ్యవసాయ అధికారులను నిలదీశారు. సంఘ పరిధిలోకి 444 యూరియా కట్టలు ఆన్లైన్లో వచ్చినప్పటికీ తమకు ఒక కట్ట కూడా బుక్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కట్టలు ఆన్లైన్లో పెడతామన్న సమయానికి కాకుండా ఆలస్యంగా ఆన్లైన్లో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతి సీజన్లో యూరియా విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సంఘ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.

యూరియా కోసం పురుగుమందు డబ్బాలతో రైతుల నిరసన