మోత్కూరు, జూన్ 7: తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బస్తాకు రెండు కిలోలు చొప్పున కోత విధిస్తుంటే.. కాంటాలు వేసిన ధాన్యం మిల్లులకు ఎగుమతి చేయడం కోసం లారీల యజమానులు వెయింటింగ్ చార్జీల పేరిట బస్తాకు రూ.10 చెల్లిస్తే తప్ప కదలడం లేదు. కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు, లారీల యజమానులు ఎవరికీ వారు డబ్బు కోసం రైతులను పిండి పిప్పి చేస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ఇలాంటి అక్రమాలు కేంద్రాల్లో జరగలేదని రైతులు అంటున్నారు. ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దడం కోసం అధికారులు ఇంకా చర్యలు ప్రారంభించలేదు. నేటితో మృగశిర కార్తె ప్రారంభం కానున్నది. రైతులు వాన కాలం నార్లు పోసేందుకు పంట పొలాల్లో ఉండాల్సిన వారు మార్కెట్, కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల నిల్వలు పేరుకు పోవడం, గన్నీ బ్యాగుల, రవాణలో జాప్యం మిల్లుల గోదాముల కొరత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. వరి పంటను నూర్పిడి చేయించిన రైతులు రెండు నెలలుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులుపడుతున్నారు. జిల్లాలోని మోత్కూరు, గుండాల, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు మండలాల్లోని ఏ గ్రామంలో చూసినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులు నిల్వలు పేరుకుపోయాయి. ధాన్యం కాంటాలు వేయించేందుకు రైతులకు అండగా ఉండాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికీ రెండు, మూడు దఫాలుగా కురిసిన వానలకు రైతుల ధాన్యం తడిసి మొలకలెత్తాయి. మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో పలువురు రైతులు తడిసిన ధాన్యన్ని ఆరబోసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహల అసమర్థత వల్ల ధాన్యం రాశులు నిల్వలు ఎక్కడిక్కడ పేరుకుపోయాయి. గన్నీ బస్తాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
గాడి తప్పిన కొనుగోళ్లు..
రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్ముకోవడానికి వస్తే కొనుగోళ్ల జాప్యంతోపాటు కొనుగోళ్ల తర్వాత మిల్లులకు తరలించకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. బస్తాలు తరలించాలని కోరితే అధికారులు వాహనాల కొరతను చూపుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక బస్తాను రవాణా చేసేందుకు రూ.6.50 పైసలు చెల్లించాలి. కానీ తూకం వేసిన తర్వాత మిల్లుకు తరలించడంలో జాప్యం జరుగుతుండటంతో రైతులు బస్తాకు రూ.10 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మిల్లుకు తరలించడంలో జాప్యం జరుగుతుండటంతో కొనుగోలు చేసిన తర్వాత కూడా రైతులు తమ ధాన్యాన్ని మిల్లుకు తరలించే వరకు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ధాన్యం తరలించడానికి టెండర్ పొందిన సివిల్ సప్లయీస్ కాంట్రాక్టర్ వాహనాలను సమకూర్చడంలో నిర్లక్ష్యం వహించడంతో ఎక్కడి బస్తాలు అక్కడే ఉండి పోయాయి. మోత్కూరు వ్యవసాయ మార్కెట్తో పాటు మండలంలోని ముశిపట్ల, దత్తప్పగూగెం, పాలడుగు, దాచారం, పాటిమట్ల, సదర్శాపురం, పొడిచేడు, అనాజిపురం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. వానలు కురిస్తే తమ ధాన్యమంతా నేల పాలు కావల్సిందేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.