యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైతులు విత్తనాల ఎంపికకు అధిక ప్రాధాన్యమివ్వాలి. విత్తనం ఎంపికపైనే పంట దిగుబడి ఆధాపడి ఉంటుంది. నాణ్యమైన విత్తన రకాలు, వాటి వివరాలపై ప్రత్యేక కథనం.
నాణ్యమైన విత్తనాలు ముఖ్యంగా నాలుగు రకాల్లో లభ్యమవుతాయి. బ్రీడర్, ఫౌండేషన్, సర్టిఫైడ్, ట్రూత్ఫుల్ లేబుల్స్లో విత్తనాలు లభ్యమవుతాయి.
ఈ విత్తనాన్ని బ్రీడర్ విత్తనం నుంచి ఉత్పత్తి చేస్తారు. వివిధ విత్తనోత్పత్తి సంస్థలు, సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో పండిస్తారు. దాదాపు 100 శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. ప్రైవేట్ విత్తన కంపెనీలు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల నుంచి బ్రీడర్ విత్తనాలు తీసుకెళ్లి ఫౌండేషన్ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఈ సీడ్కు తెలుపు రంగు ట్యాగ్ వేస్తారు.
ఇది అన్ని రకాల విత్తనాలకు మూల విత్తనం. దీన్ని కంపెనీలు ఆయా బ్రీడర్ల పరవ్యేక్షణలో పండిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తలు రూపొందించేవి ఇటువంటి విత్తనాలే. ఈ విత్తనం 100 శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. బ్రీడర్ సీడ్కు బంగారు రంగు ట్యాగ్ వేస్తారు. సీడ్ ధర చాలా ఎక్కువ. రైతులకు రెండు కిలోలకు మించి బ్రీడర్ సీడ్ ఇవ్వరు.
విత్తనం నుంచి నేరుగా సర్టిఫైడ్(ధ్రువీకరించిన) విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. వివిధ సంస్థలు, రైతుల పొలాల్లో కూడా విత్తన పర్యవేక్షకుల సమక్షంలో పండించే అవకాశం ఉంది. ఈ విత్తనానికి నీలిరంగు ట్యాగ్ వేస్తారు.
సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి చేసిన ఈ విత్తనాన్ని విత్తన ధ్రువీకరణ సంస్థ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ విత్తనాలను ట్రూత్పుల్ లేబుల్ కింద రైతులకు విక్రయిస్తుంటారు. ట్రూత్పుల్ లేబుల్ విత్తనానికి ఆకుపచ్చ రంగు ట్యాగ్ వేస్తారు. లేబుల్ ట్యాగ్పై విత్తన పరీక్ష చేసిన తేదీ ఉంటుంది. ఆ తేదీ నుంచి తొమ్మిది నెలల కాలపరిమితి లోపు విత్తనాన్ని కొనుగోలు చేయవచ్చు.
వరి పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి. దళారుల మాటలు నమ్మకుండా వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. లూజుగా ఉన్న సంచులు, గడువు దాటిన విత్తనాలను కొనుగోలు చేయరాదు. అధికారుల సలహాలు, సూచనలు పాటించి వరి సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.
-షేక్ జావిద్, ఏఓ, నేరేడుచర్ల