చెరుకు సాగును నమ్ముకున్న రైతులు లాభాల బాట పడుతున్నారు. ఈ పంట సాగుతో లాభాలు తప్ప నష్టం ఉండదని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. ఒక్కసారి పంట సాగు చేస్తే మూడేండ్ల వరకు విత్తనం వేసే పని ఉండదని పేర్కొంటున్నారు. ఈ పంట సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్న రైతులను ఆదర్శంగా తీసుకొని మండలంలోని ఎంతోమంది రైతులు అదే బాటలో నడుస్తున్నారు.
కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం, దుగినవెల్లి, మాణిక్యాలమ్మగూడెం, సవుళ్లగూడెం, ఎరసానిగూడెం, కల్మెర, బొల్లేపల్లి, ఈదులూరు గ్రామాల్లో 200 ఎకరాలకు పైగా రైతులు చెరుకు పంటను సాగు చేస్తున్నారు. బోరుబావుల ఆధారంగా ఆయా గ్రామాల్లోని రైతులు గత ఐదు ఏండ్లుగా చెరుకు సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారు. చెరుకు సాగు చేసిన రైతులు చెరుకును కత్తిరించిన తరువాత ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని చెరుకు ఫ్యాక్టరీకి లారీల ద్వారా తరలిస్తున్నారు. టన్ను చెరుకు ధర రూ.3,200 వరకు అమ్ముతూ లాభాలు ఆర్జిస్తున్నారు.
రైతులు ఒక్కసారి చెరుకు నాటితే మూడేండ్లపాటు పంట ఉంటుంది. మరోసారి మొక్క నాటాల్సిన అవసరం ఉండదు. ఎకరం సాగు చేసేందుకు రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతుంది. చెరుకు మొక్క నాటిన నుంచి 12 నెలల తరువాత పంట కోతకు వస్తుంది. చెరుకు నాటిన తరువాత మనిషి లోతు కాగానే జడ కట్లు కడుతారు. చెరుకు నాటిన తరువాత ఎరువులు, సాగునీటిని సకాలంలో అందిస్తే ఏపుగా పెరుగుతుంది. ఎకరానికి 60 నుంచి 70 టన్నుల వరకు దిగుబడి రావడంతో పెట్టుబడి పోగా ఎకరానికి రూ.లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు.
వరి సాగు చేస్తే కష్టంతోపాటు పెట్టుబడి ఎక్కువ, లాభాలు తక్కువగా వచ్చేవి. ఆంధ్రా రైతుల సలహా మేరకు గత ఆరేండ్లుగా 2 ఎకరాల్లో చెరుకు సాగు చేస్తున్నా. చెరుకు పంటకు సకాలంలో అడుగు పిండి, నీరందిస్తే మంచి దిగుబడి వస్తుంది? నాకున్న నీటి వసతి రెండెకరాల చెరుకు పంటకు సరిపోతుంది. ఎకరానికి 60 నుంచి 70 టన్నుల దిగుబడి వస్తుంది. టన్నుకు రూ.3,200చొప్పున ఖమ్మం జిల్లాకు చెందిన కంపెనీ వాళ్లు తీసుకెళ్తున్నారు. ఎక్కువ పెట్టుబడి లేకుండానే చెరుకుసాగులో సంతృప్తికరమైన లాభాలు పొందుతున్నా.
-కాడింగ్ భీమయ్య, రైతు, మాణిక్యాలమ్మగూడెం