హాలియా, డిసెంబర్ 16 : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రైతులు, కూలీలు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. వానకాలం ముగిసి యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులు ఓ వైపు వరి కోతలు కోస్తుండగా.. మరోవైపు నాట్లు వేస్తున్న పరిస్థితి ఉన్నది.
ఈ ఏడాది నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేయలేమని, రైతులు క్రాప్ హాలిడే పాటించాలని ఎన్ఎస్పీ అధికారులు పేర్కొన్నారు. దీంతో బోరు బావులు ఉన్న రైతులు తిండి గింజల కోసం వరి సాగు చేస్తుండగా.. మరికొంత మంది మినుములు, నువ్వుల పంటలు వేశారు. గత ఏడాది యాసంగిలో సాగర్ నియోజకవర్గ రైతులు లక్షా 20వేల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈ ఏడాది సాగు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నది.