నేరేడుచర్ల, ఏప్రిల్ 28 : వేసవిలో దుక్కి దున్నడాన్ని రైతులు వృథా ఖర్చుగా భావిస్తుంటారు. దీంతో యాసంగి పంటల కోతల తర్వాత మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు నేలను దుక్కి చేయకుండా వదిలేస్తుంటారు. కానీ.. వేసవి దుక్కుల వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని, కర్బన శాతం, నీటిని నిలుపుకొనే శక్తి పెరుగుతుందని నేరేడుచర్ల ఇన్చార్జి ఏఓ ప్రీతంకుమార్ సూచిస్తున్నారు.
వేసవి దుక్కులు చేయకుంటే..
వేసవి దుక్కులు దున్నకుంటే కలుపు మొక్కలు విపరీతంగా పెరిగి నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూసారం తగ్గడానికి కారణమవుతాయి. భూమిలోని లోతైన పొరల నుంచి కూడా తేమను తీసుకుంటూ, ఆవిరి రూపంలో బయటకు పంపుతాయి. దీని వల్ల ముడి పోషకాల కొరత ఏర్పడి తర్వాత వేసే పంటలకు అత్యధిక మోతాదులో రసాయన ఎరువులు వాడాల్సి వస్తుంది. పంట కోత తర్వాత దుక్కి దున్నకుండా వదిలివేయడంతో వర్షాకాలం వచ్చిన తర్వాత భూమిని సిద్ధం చేసేందుకు ఆలస్యమవుతుంది. దీంతో పంటను సరైన సమయంలో విత్తుకోలేరు.
వేసవి దుక్కులతో లాభాలివి..
చీడపీడల నివారణ : వేసవి కాలంలో చీడ పురుగులు, తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు భూమిలో ఆశ్రయం పొందుతాయి. వేరుశనగ, చెరుకు, పండ్ల చెట్లను ఆశించే వేరు పురుగులు.. అపరాలు, పత్తి, కంది మొదలైన పంటలను ఆశించే పచ్చపురుగు, లద్దెపురుగు, బొంతపురుగు, దాసరి పురుగులు కోశస్థ దశలో భూమిలోనే ఉంటాయి. తొలకరి వర్షాలు కురిసినప్పుడు రెక్క పురుగులు ప్యూపాల నుంచి బయటకు వచ్చి పంటలను ఆశించి నష్టపరుస్తాయి. వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల నేలలో ఉన్న చీడపురుగుల కోశస్థ దశలు, గుడ్లు బయటపడి ఎండ వేడికి చనిపోతాయి.
కలుపు నివారణ : కలుపు మొక్కలు పంటకు ప్రత్యక్షంగా నష్టం కలిగించడంతోపాటు పరోక్షంగా చీడపీడలకు ఆశ్రయం ఇచ్చి, పంట నష్టానికి కారణమవుతాయి. వేసవి దుక్కులతో బహువార్షిక కలుపు మొక్కలైన తుంగ, గరిక, రెల్లదర్బ వంటివి నాశనమవుతాయి.
నేలలో నీటి నిల్వ పెంపు : వేసవి దుక్కులను వాలుకు అడ్డంగా చేసుకోవాలి. వాలు వెంట దున్నితే నేల కోతకు గురై సారవంతమైన మట్టి కొట్టుకుపోతుంది. వేసవి దుక్కులు చేసే ముందు పశువుల ఎరువు గానీ, కంపోస్టు గానీ, చెరువు మట్టి గానీ వెదజల్లితే భూమికి తేమను నిలుపుకొనే శక్తి పెరుగుతుంది.
నేల గుల్లబారుతుంది : వేసవి చేసినప్పుడు, ఆ తర్వాత తొలకరి వర్షాలకు దున్నినప్పుడు నేల గుల్లబారుతుంది. దాంతో మొక్కల వేర్లు బాగా విస్తరిస్తాయి. చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందడంతోపాటు వానపాముల సంతతి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
పంట అవశేషాల సద్వినియోగం : లోతు దుక్కి దున్నినప్పుడు పంట అవశేషాలు, కలుపు మొక్కలు, పంటల నుంచి రాలిపడిన ఆకులు నేలలో కలిసి సేంద్రియ ఎరువుగా మారుతాయి. దీంతో నేలలో సేంద్రియ కర్బన శాతం, పోషక పదార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది.