తల్లీబిడ్డ క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలోని కేంద్ర ఆస్పత్రి, ఏరియా, కమ్యూనిటీ, పీహెచ్సీల్లో అన్నిరకాల సదుపాయాలు కల్పించారు. వైద్యులు, సిబ్బంది, అవసరమైన పరికరాలు, మందులు, నాణ్యమైన సేవలు అందుబాటులో ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు కూడా అందేవి కావు. కనీసం డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. రెండు, మూడు ఆస్పత్రులకు ఒక వైద్యుడిని నియమించిన పరిస్థితులు. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా సర్కారు దవాఖానాల్లో సదుపాయాలు, సేవలు అందుతున్నాయి.
ఆర్నెల్లలోనే 10 శాతానికి పైగా పెంపు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొంతకాలంగా ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. జిల్లాలో ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రులు కలిపి నెలకు సగటున 900 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో అధిక శాతం ప్రభుత్వం ఆస్పత్రుల్లో డెలివరీలు అవుతున్నాయి. గతంలో ఇందుకు భిన్నంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధికంగా జరిగేవి. ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. క్రమక్రమంగా సర్కారు దవాఖానల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. ఉదాహరణకు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనవరిలో నెలలో 57.71శాతం ప్రసవాలు జరిగాయి. మొత్తం ప్రసవాల్లో అధికంగా 57.38 శాతం ఆపరేషన్లు జరిగాయి. కానీ, జూన్ వచ్చేసరికి 68 శాతం మంది సర్కారు దవాఖానల్లో ప్రసవాలు చేయించుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఆరు నెలల్లోనే సుమారు 10 శాతానికి పైగా ప్రసవాలు పెరిగాయి. అలాగే సాధారణ ప్రసవాలు కూడా పెరుగడం విశేషం. జూన్లో ఆపరేషన్లు 53 శాతానికి పడిపోయాయి.
శుక్రవారం సభలతో సత్ఫలితాలు..
మహిళల్లో అవగాహన కల్పించేందుకు జిల్లాలో శుక్రవారం సభలకు కలెక్టర్ పమేలా సత్పతి శ్రీకారం చుట్టారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించడం శుక్రవారం సభల ముఖ్య ఉద్దేశం. అంతే కాకుండా ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు చేయించడం, తల్లిపాల ప్రాధాన్యం గురించి చెప్పడం, టీకాలు వేయించడం, అవగాహన కల్పించడం కూడా ఇందులో ఓ భాగం. ప్రతి శుక్రవారం గర్భిణులు, బాలింతలు, పిల్లలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఆశలు, ఏఎన్ఎంలతో అవగాహన
సర్కారు ఆస్పత్రుల్లో డెలివరీలు పెరుగడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు అద్భుతంగా పని చేస్తున్నారు. ప్రతి గర్భిణికి సర్కారు ఆస్పత్రులపై భరోసా పెరిగే అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో చెకప్లకు వెళ్తున్న వారికి కూడా ప్రభుత్వం అందిస్తున్న వైద్యం, ఉపయోగాల గురించి వివరిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు సమర్థవంతంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా సాధారణ ప్రసవాల ఉపయోగాలు, సిజేరియన్లతో కలిగే దుష్ప్రభావాలను గర్భిణులకు స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతున్నారు. దాంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే..
సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. ఆస్పత్రుల్లో కేసులు పెంచేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆశ వర్కర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆశలకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ప్రసవాల పెంపులో భాగంగా కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో తల్లీబిడ్డలకు అవసరమయ్యే సుమారు రూ.15 వేల విలువైన వస్తువులు అందిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేల చొప్పున సాయం చేస్తున్నది. ఇక మిడ్ వైఫ్ కార్యక్రమంతో గర్భిణులు ఎలా ఉండాలో వివరిస్తున్నారు. ఏ నెలలో ఏ వ్యాయామం చేయాలి..? ఏ యోగా చేయాలి అనేది తెలియజేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. మాతా, శిశు మరణాల సంఖ్య సైతం తగ్గుముఖం పట్టింది.
పేదలపై తగ్గిన ఆర్థిక భారం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకుంటుండటంతో పేదలకు ఎంతో మేలు జరుగుతున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతున్నది. సాధారణంగా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే రకరకాల పరీక్షలు, మందుల పేరుతో పెద్ద ఎత్తున బిల్లులు వేస్తారు. దాంతో వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సర్కారు దవాఖానల్లో ఉచితంగా సేవలు అందిస్తుండటంతో పేదలకు ఆర్థిక భారం తగ్గుతున్నది.
ప్రత్యేక చర్యలతో ప్రసవాలు పెరుగుతున్నయ్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు, కార్యక్రమాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. గత ఆరు నెలలుగా పరిశీలిస్తే 10 శాతానికి పైగా ఉంది. నేను విధుల్లో చేరిన కొత్తలో ప్రసవాల సంఖ్య 30 శాతం మాత్రమే ఉంది. ఇప్పుడు 68 శాతానికి పెరుగడం సంతోషంగా ఉంది. శుక్రవారం సభలతో కూడా మహిళల్లో మార్పు వస్తున్నది. ఈ సభల్లో వివిధ విభాగాల సిబ్బంది గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు. కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి తదితర కార్యక్రమాలు సైతం ఎంతో మార్పు తీసుకొస్తున్నాయి. ఫలితంగా పేదలపై భారం తగ్గుతున్నది.
– పమేలా సత్పతి, కలెక్టర్, యాదాద్రి భువనగిరి