భువనగిరి అర్బన్, డిసెంబర్ 6: జనవరి 18 నుంచి జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రణాళికబద్దంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్న దృష్ట్యా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హారీశ్రావు కలెక్టర్లతో మంగళవారం నిర్వ హించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులతో ఆమె కంటి వెలుగుపై సమావేశం నిర్వ హించి మాట్లాడారు.
రెండో విడుత కంటి వెలుగు జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుందని, జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించా లని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 300, అర్బన్ ప్రాంతాల్లో 400 మందిని పరీక్షించేలా జిల్లాలో 34 టీమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కంటి వెలుగు శిబిరాల షెడ్యూల్ను పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులు, సమన్వయంతో నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ చిన్నానాయక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి చిన్నారికీ ఆధార్ నమోదు చేయించాలి
ప్రతి చిన్నారికీ తల్లిదండ్రులు ఆధార్ నమోదు చేయించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆధార్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ను ప్రతి పదేండ్లకోసారి ఆధార్ నవీకరణ చేయించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి, జిల్లా లీడ్ బ్యాంకు అధికారి రామకృష్ణ, డీఈఓ నారాయణరెడ్డి, జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి పాల్గొన్నారు.