నీలగిరి, జనవరి 31 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో 9వ రోజు మంగళవారం ప్రజలు నేత్రానందంతో పాల్గొన్నారు. జిల్లాలో ఎక్కువగా మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున శిబిరాలకు చేరుకొని కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం 74 వైద్య బృందాలు 9,299 మందికి పరీక్షలు చేయగా ఇప్పటివరకు మొత్తం 76,537 మందికి వైద్య బృందాలు పరీక్షలు నిర్వహించాయి. స్థానిక ప్రజాప్రతినిధులు వైద్య పరీక్షలను పర్యవేక్షించి రోగులకు కంటి ఆద్దాలు, మందులను అందజే శారు. గ్రామీణ ప్రాంతాల్లో 61 చోట్ల, పట్టణ ప్రాంతాల్లో 13 చోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 9,299 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 4,548 పురుషులు, 4,738 మంది స్త్రీలు, ఇతరులు ఒకరు పాల్గొన్నారు. ఎస్సీలు 1,593, ఎస్టీలు 1,014 బీసీలు 5,462, ఓసీలు 979, మైనార్టీలు 221 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 1,408 మంది దగ్గరి, 1,014 మందికి దూరం చూపు సమస్య ఉన్నందున వారికి కంటి అద్దాలు అందజేశారు. దగ్గర చూపులో 40 ఏండ్ల లోపు వారు 208 మంది, 40 ఏండ్ల పైబడిన వారు 1,200 మంది కాగా వివిధ కారణాలతో కంటి సమస్యలు ఉన్న 7,075 మందిని గుర్తించి వారిని జిల్లా కేంద్ర అసుపత్రికి రెఫర్ చేశారు. కార్యక్రమాల్లో మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు మెడికల్ అఫీసర్లు, కోఅర్డినేటర్లు, ఆప్తమాలజిస్టులు ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలో 50 వేల మందికి పరీక్షలు పూర్తి
జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాటికి 50,759 మందికి కంటి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 51 బృందాలు కంటి పరీక్షల్లో పాల్గొనగా 6,384 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 1,519 మందికి రీడింగ్ గ్లాస్లు, 745 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్ చేశారు. 3,028 మందికి మందులు అందజేశారు.