యాదాద్రి, నవంబర్ 30 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రపంచమే అబ్బుపరపడే విధంగా రూపుదిద్దుకున్నది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడికితతవచ్చిన భక్తులకు ఆరోగ్య పరమైన సేవలను అందించడంతోపాటు యాదగిరిగుట్ట పట్టణం, చుట్టు పక్కల రాజాపేట, మోటకొండూర్, ఆలేరు, తుర్కపల్లి, బొమ్మలరామారంతో పాటు పక్కనే ఉన్న భువనగిరి మండలం పలు గ్రామ ప్రజలకు సత్వరమే సేవలందించేందుకు ప్రభుత్వం పూనుకున్నది. గతంలో ఉన్న కేవలం 6 పడకలతో ఉన్న పీహెచ్సీని 100 పడకల ఏరియా దవాఖానగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో వసతుల కోసం రూ. 45.79 కోట్ల నిధులు మంజూరుకాగా ఇందులో నాన్ రికరింగ్ వ్యయం కింద రూ. 35.95 కోట్లు, రికరింగ్ వ్యయం కింద రూ.9.84 కోట్లు మం జూరు చేస్తూ జీఓ నంబర్ 722ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. 100 పడకల ఏరియా దవాఖానగా మారనున్న యాదగిరిగుట్ట ప్రభుత్వ దవాఖాన రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ నేతృత్వంలో 24 గంటల పాటు అన్ని విభాగాల సేవలను అందించనున్నది.
2000 సంవత్సరంలో పీహెచ్సీ భవనం..
1982-83 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మండలాల విభజన జరిగింది. ఆయా మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయగా అందులో భాగంగా యాదగిరిగుట్టకు పీహెచ్సీ మంజూరైంది. మొదటగా ప్రశాంత్నగర్లో అద్దె భవనం కేంద్రంగా వైద్య సేవలు అందించేవారు. 2000 ఫిబ్రవరి 17న అప్పటి ఆంధ్రపదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హయాంలో యాదగిరిపల్లిలో 6 పడకల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. నాటి నుంచి ఇద్దరు వైద్యాధికారులు, నలుగురు స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్ట్, హెల్త్ సూపర్వైజర్, ఒక పీహెచ్ఎన్, 18 మంది ఏఎన్ఎంలతో యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా 9 సబ్ సెంటర్లలో వైద్యాన్ని అందిస్తున్నారు. దాంతో పాటు 24 గంటల మెటర్నిటీ వైద్య సేవల ను అందిస్తున్నది. తాజాగా సీఎం సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మారుస్తూ ఒక్క దవాఖానకు ప్రత్యేక వైద్యాధికారిని నియమించారు.
13 సబ్ సెంటర్లకు రూ.2.60 కోట్లు
ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 13 సబ్ సెంటర్లకు పక్కా భవనాలకు రూ.2.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఒక్కో సబ్ సెంటర్కు రూ.20 లక్షల నిధులు కేటాయిస్తూ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు మండలం గుండ్లగూడెం, యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, చొల్లేరు, బొమ్మలరామారం మండలం మైలారం, రామలింగంపల్లి, ఆత్మకూరు(ఎం) మండలం కూరెళ్ల, తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, వెల్పుపల్లి, గుండాల మండలం మాసాన్పల్లి, కొమ్మాయిపల్లి, రాజాపేట మండలం బొందుగుల, పారుపల్లి, మోటకొండూర్ మండలం నాంచారిపేట సబ్ సెం టర్లకు ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి.
ఫిబ్రవరి 3న మంత్రి హరీశ్రావుకు వినతి..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య విమానగోపురం స్వర్ణతాపడ విరాళాలు అందించేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఫిబ్రవరి 3న వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్ గౌడ్ మంత్రికి వినతి పత్రం అందజేశారు. దాంతో 100 పడకల ఏరియా దవాఖానగా అప్గ్రేడ్ చేస్తూ జీఓ జారీ కావడంతో పట్టణ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రులకు ధన్యవాదాలు.
యాదాద్రి పుణ్యక్షేత్రానికి దేశ, విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు స్వామివారి దర్శించుకునేందుకు వస్తున్నారు. అలాంటి పుణ్య క్షేత్రంలో సకల సౌకర్యాలు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ పీహెచ్సీని 100 పడకల ఏరియా దవాఖానగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడి ప్రాంతం ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డికి ధన్యవాదాలు.
– ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి