సూర్యాపేట, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనులు సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి పనులు చేయిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం హుజూర్నగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి, ట్రెజరీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవాలతోపాటు రూ.76.30 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఉప ఎన్నికల్లో గెలిచిన మూడున్నరేండ్లలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు దాదాపు రూ.3500 కోట్లతో పనులు చేశారన్నారు. తాజాగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన ప్రసంగంలో నియోజక వర్గానికి నిధులు కావాలని కోరగా వెంటనే రూ.35 కోట్లు మంజూరు చేయిస్తానన్నారు. అలాగే మేళ్లచెర్వు శివాలయం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని కోరడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన సహకారం చేయిస్తానన్నారు. మరో చారిత్రాత్మక ప్రాంతమైన జాన్పాడ్ దర్గా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. మేళ్లచెర్వు జాతర సందర్భంగా జరిగే ఎడ్ల పందేలకు ఈ సారి తప్పకుండా వస్తానని మంత్రి హామీ ఇచ్చారు.