యాదగిరిగుట్ట, ఆగస్టు 20 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంతో స్వయంభూ నారసింహస్వామికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి సుదర్శన నారసింహ హోమం ఘనంగా జరిపారు.
సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను పట్టు వస్ర్తాలతో అలంకరించి గజ వాహన సేవ నిర్వహించారు. మొదటి ప్రాకార మండపంలో తూర్పునకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి.
ప్రధానాలయం, క్యూ కాంప్లెక్స్, శివాలయం చెంతన గల క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. సుమారు 7వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.10,39,750 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ భాస్కర్రావు తెలిపారు.