యాదగిరిగుట్ట, జనవరి 22 : యాదగిరిగుట్ట కొండపై ప్రతి నిర్మాణం ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా సాగుతున్నాయి. కొండపైన స్వాగత తోరణం చూడగానే భక్తులకు భక్తి పరవశం కలుగుతుంది. ఆ పక్కనే సువిశాలంగా నిర్మిస్తున్న భవనాన్ని చూస్తే ఔరా అనక తప్పదు. ప్రతి కట్టడం స్వామివారి ఆలయానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. భవనం గోడలకు అంబారీపై స్వామివారి ఊరేగింపు, ఐరావతాలు, దేవతామూర్తుల విగ్రహాలు, కాకతీయ పిల్లర్లు, శంకుచక్ర తిరునామాలు, గరుత్మంతుడు, క్షేత్రపాలకుల విగ్రహాలు, మండపాలు, సాలాహార విగ్రహాలు, గోపురాల నమూనాల వంటి ఆధ్యాత్మిక కట్టడాలతో భవనం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నది. ఇందులో ప్రత్యేకమైన కార్యనిర్వహణ కార్యాలయం, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయనున్నారు.
కమాండ్ కంట్రోల్ రూం..
రాయగిరితోపాటు యాదగిరిగుట్ట ఆలయం చుట్టూ ఉన్న సీసీ కెమెరాలతో పాటు భద్రత వ్యవస్థను పర్యవేక్షించేందుకు భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ప్రత్యేకమైన కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇందులో 10×12 పరిమాణంలో ఎల్ఈడీ స్క్రీన్ బిగించి ఎప్పటికప్పుడు ప్రత్యక్ష తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో జరిగే సంఘటనలు, ఇతరత్రా ప్రమాదాలు వెంటనే కమాండ్ కంట్రోల్కు తెలిసిపోయే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. కొండపైన భద్రతకు వినియోగించే ప్రతి పరికరానికి ఇజ్రాయిల్, జర్మన్ సాంకేతికతను వినియోగించారు. అదేవిధంగా యాదగిరిగుట్టలో 24 గంటల పాటు డీసీపీ స్థాయి భద్రతా వ్యవస్థ అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ఉదయం 4నుంచి రాత్రి 10 గంటల వరకు పటిష్ట స్థాయి పోలీసింగ్ వ్యవస్థ స్వామివారి సన్నిధిలో అందుబాటులోకి రానుంది.
రాచకొండ కమిషనరేట్ నేతృత్వంలో సుమారు 200 మంది పోలీసు అధికారులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ఇందులో ఏసీపీ, సీఐ, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్, మహిళా పోలీసులు, హ్యూమన్ ప్రొటెక్షన్ సెల్ సిబ్బంది ఉంటారు. అనుక్షణం భక్తులను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బంది వాటిల్లినా వెంటనే వెళ్లి పరిష్కరిస్తారు. ఇప్పటికే కొండపైన ప్రధానాలయ ప్రాంగణంలో దేవస్థానం తరఫున 90 సీసీ కెమెరాలు, చుట్టూ 152 సీసీ టీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. కొండపైన, రింగ్రోడ్డు చుట్టూ, ప్రెసిడెన్సియల్ సూట్, యాదాద్రి- రాయగిరి ప్రధాన రోడ్డు వెంట బిగించిన సీసీ కెమెరాలను కొండపైన కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. ఈ కెమెరాలను బంజారాహిల్స్లోని రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. దీంతోపాటు కింది అంతస్తులో విద్యుత్ విభాగానికి సంబంధించిన ప్రత్యేక చాంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
విశాలంగా కార్యనిర్వాహక కార్యాలయం
భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అందుకనుగుణంగా అడ్మినిస్ట్రేషన్ విభాగాలను మరింతగా విస్తరించనున్నారు. ఇందుకోసం విశాలమైన ఆలయ కార్యనిర్వాహక కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. స్వాగత తోరణం పక్కనే నిర్మిస్తున్న భవనం మొదటి అంతస్తులో ఆయా విభాగాలకు ప్రత్యేకమైన చాంబర్లను నిర్మిస్తున్నారు. దీంతో ప్రత్యేకమైన మరుగుదొడ్లు, భోజనం చేసేందుకు ప్రత్యేక గదులను నిర్మిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లీగల్స్తో పాటు ఈఓకు ప్రత్యేక చాంబర్ను ఏర్పాటు చేస్తున్నారు.