యాదగిరిగుట్ట, ఏప్రిల్ 18 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, దబ్బగుంటపల్లి యోగానంద నరసింహస్వామి ఆలయంలో మే 2నుంచి 4వ తేదీ వరకు స్వామివారి జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ మేరకు యాదగిరిగుట్ట ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీత మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం 2వ సారి జరిగే మొదటి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. జయంత్యుత్సవాల్లో భాగంగా స్వామివారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత పూజలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
పాతగుట్ట దేవాలయంలో ..
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మే 2న ఉదయం 9:30 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, లక్ష పుష్పార్చన, సాయంత్రం 6గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
మే 3న ఉదయం 9:30 గంటలకు విశేష స్నపనం, నిత్య హవనం, నృసింహ మూలమంత్ర హవనం, లక్ష పుష్పార్చన, సాయంత్రం 6గంటలకు నృసింహ మూలమంత్ర హవనం నిర్వహించనున్నారు.
మే 4న ఉదయం 9:30 గంటలకు నిత్యహవనం, పూర్ణాహుతి, అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం 7గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావ నివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహిస్తారు.
దబ్బగుంటపల్లిలో..
జనగామ జిల్లాలోని దబ్బగుంటపల్లిలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మే 4న ఉదయం 9గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, అభిషేకం, ఉదయం 11గంటలకు స్వామివారి కల్యాణం, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగం, ఆశీర్వచనం చేపట్టనున్నారు.
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో ఉత్సవాల వివరాలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో వచ్చే నెల 2న ఉదయం 9:30 గంటలకు జయంత్యుత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, పూణ్యాహవాచనం, ఋత్విక్ వరణం, కుంకుమార్చన చేపట్టి తిరు వెంకటపతి అలంకార సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం నిర్వహించి, గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ చేపడుతారు.
మే 3న ఉదయం 9:30 గంటలకు నిత్యమూలమంత్ర హవనం, లక్ష పుష్పార్చన, కాళీయమర్ధన అలంకార సేవ, సాయంత్రం 6గంటలకు నృసింహ మూలమంత్ర హవనం, హనుమంత వాహనంపై రామావతార అలంకార సేవ ఉంటుంది.
మే 4న ఉదయం 7గంటలకు యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో మూలమస్తృ హవనం, ఉదయం 9నుంచి 9:30 గంటల వరకు మహాపూర్ణాహుతి అనంతరం సహస్ర కలశాభిషేకం, సాయంత్రం 7 గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించి ఉత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు.
ఆర్జిత పూజలు నిలిపివేత
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో మే 2నుంచి 4వ తేదీ వరకు నృసింహస్వామి జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నందున ఆలయంలో జరిగే ఆర్జిత పూజలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత తిరుకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.