రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
సందీప్కుమార్ సుల్తానియా
ఆత్మకూర్.ఎస్, జూన్ 15 : నేడు గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉన్నదంటే అది పల్లె ప్రగతితోనే సాధ్యమైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం మండలంలోని ఏపూరులో పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డు, వర్మీకంపోస్ట్ షెడ్డును పరిశీలించారు. క్రీడా ప్రాంగణంలో మొక్కలు నాటారు. వైకుంఠధామంలో శవాలను దహనం చేయాల్సిన చోట చేయకుండా మరో చోట చేయడం, స్నానాల గదిలో లైట్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశం బాగుండాలంటే గ్రామం బాగుండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
గ్రామ పంచాయతీల మార్పు కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారని, ఈ చట్టం ద్వారా అధికారాలు, బాధ్యతలు పొందుపరుస్తామని, దానికి అనుగుణంగా అభివృద్ధి జరుగుతుందని వివరించారు. గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు.గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే పల్లె ప్రగతి ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జడ్పీ సీఈఓ సురేశ్, డీపీఓ యాదయ్య, డీఆర్డీఓ కిరణ్కుమార్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎంపీపీ మర్ల స్వర్నలతా
చంద్రారెడ్డి, తాసీల్దార్ హేమమాలిని, సర్పంచ్ సానబోయిన రజితాసుధాకర్, ఎంపీటీసీ దామిడి మంజుల, ఎంపీడీఓ మన్సూర్నాయక్, ఎంపీఓ సంజీవ, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.