సూర్యాపేట అర్బన్, మార్చి 10 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్లో వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ, వసతి పొందడానికి ఆదివారం స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష సజావుగా జరిగింది. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 380మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 277మంది పరీక్షకు హాజరయ్యారు.
103మంది గైర్హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష మార్కుల ద్వారా 100మంది అభ్యర్థులకు, డిగ్రీ మార్కుల ఆధారంగా మరో 100మంది అభ్యర్థులకు స్టడీ సెంటర్లో ప్రవేశం కల్పించనున్నట్లు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ చిట్టిపాక రాములు తెలిపారు. ప్రవేశం పొందిన అభ్యర్థులకు గ్రూప్స్తో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు కావాల్సిన శిక్షణ, వసతి కల్పించనున్నట్లు చెప్పారు. డీఎస్డబ్ల్యూఓ కె.లత పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. వారి వెంట ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వి.వెంకటేశులు తదితరులు ఉన్నారు.